
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి
కర్నూలు(సెంట్రల్): జైరాజ్ ఇస్పాత్, జియో మైసూర్, గ్రీన్కో తదితర కంపెనీలు స్థాపించిన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను పి.రంజిత్బాషా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సింగిల్ డెస్కులో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలన్నారు. జిల్లాలో టమాట, ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి 2,135 దరఖాస్తులను ప్రభుత్వానికి పంపామని, వీటి మంజూరుపై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ జీఎంను ఆదేశించారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ నీటి సరఫరాకు సంబంధించి అంచనాలు వేయించాలని కర్నూలు మునిసిపల్ కమిషనర్కు సూచించారు. అనంతరం రూ.1.61 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపారు.
ఈదుల దేవరబండలో ఉల్లి ప్రాసెస్ యూనిట్
పత్తికొండ సమీపంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి తెలిపారు. దేవనకొండ మండలం ఈదుల దేవరబండలో 10 ఎకరాలను ఉల్లి ప్రాసెస్ యూనిట్ ఏర్పాటుకు కేటాయించామని ఏపీఐఐసీ జెడ్ఎం వివరించారు. బనవాసి దగ్గర టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్కు చర్యలు తీసుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ జీఎం అరుణ తెలిపారు. కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఏపీఐఐసీ జెడ్ఎం శ్రీనివాసరెడ్డి, పీసీబీ ఈఈ కిశోర్కుమార్రెడ్డి, ఐలా చైర్మన్ రామకృష్ణారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయకుమార్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, దళిత్ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా ప్రెసిడెంట్ దిలీప్కుమార్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా

స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి