
చదువుకు పేదరికం అడ్డుకారాదు
కోవెలకుంట్ల: చదువుకు పేదరికం అడ్డుకారాదని కార్మిక శాఖ అదనపు కార్యదర్శి, జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు అన్నారు. సంజామల మండలం ఆల్వకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లె పుల్లయ్య శనివారం పదవీ విరమణ పొందారు. పట్టణ శివారులోని వీఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాలులో ఆయనకు పదవీ విరమణ సన్మాన సభ ఏర్పాటు చేశారు. గంధం చంద్రుడు ఈ కార్యక్రమానికి హాజరై తనకు చదువు చెప్పి ఉన్నత స్థాయిలో నిలిపిన ఉపాధ్యాయుడిని ఘనంగా సత్కరించి గురుభక్తి చాటుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 1950 సంవత్సరానికి ముందు చదువు మూడు శాతం మందికి మాత్రమే అందేదని, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. 2024 కులగణన ప్రకారం అక్షరాస్యత, కుటుంబ మౌలిక సదుపాయాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందన్నారు. తల్లిదండ్రుల తర్వాత సమాజంలో ఉపాధ్యాయుడికి సముచితస్థానం ఉందన్నారు.
కొలిమిగుండ్ల మండలం కోటపాడు ప్రాథమిక పాఠశాలలో 1990–92 మధ్యకాలంలో తాను పుల్లయ్య సార్ వద్ద చదువు నేర్చుకుని జవహర్ నవోదయ పాఠశాలకు ఎంపికయ్యానన్నారు. ఆ తర్వాత కాలంలో ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ సాధించానని ఈ సందర్భంగా చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు రాజయ్య, వెంకటసుబ్బయ్య, ఈశ్వరయ్య, హెచ్ఎం హరిప్రసాద్, రిటైర్డ్ హెచ్ఎంలు నాగేశ్వరరెడ్డి, పక్కీరెడ్డి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.