
డీఎస్సీపై డౌట్ లోడ్!
కర్నూలు(సిటీ): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీలో పొర‘పాట్లు’ చోటుచేసుకుంటున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తామని డీఎస్సీ జేడీ కార్యాలయం చెప్పింది. అయితే కొందరికి మాత్రమే డౌన్లోడ్ అయ్యాయి. వాటిలోనూ తప్పులు ఉన్నాయి. మొత్తం మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ఒకదానికి మాత్రమే హాల్టికెట్ వచ్చింది. ఐడీ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసినా హాల్ టికెట్ డౌన్లోడ్ కాలేదు. సాంకేతిక సమస్యలతో చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చెందారు. కర్నూలు జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ దృష్టికి తీసుకుపోవడంతో ఆ తర్వాత వారు డీఎస్సీ నిర్వాహకుల దృష్టికి సమస్యను తీసుకుపోయిన తర్వాత కొంత పరిష్కారమయ్యింది. డీఎస్సీకి రాష్ట్రంలో అత్యధికమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో సాంకేతిక సమస్యలతో హాల్టికెట్లలో పొరపాట్లు వచ్చాయని, ఆదివారం ఉదయం లోపు సమస్య సర్దుబాటు అవుతుందని అభ్యర్థులకు డీఈఓ తెలియజేశారు.
ఏ కేంద్రంలో ఎంతమంది?
ఉమ్మడి జిల్లాలో 2,645 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు మొత్తం 73,605 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో కర్నూలులో 5, నంద్యాలలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏ కేంద్రంలో ఎంతమంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలి. అయితే ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు స్పష్టత రాలేదు. నెల రోజుల పాటు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశమున్నట్లు ఆందోళన చెందుతున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే ప్రశ్నపత్రం, ఒకే జిల్లా ఒకే ప్రశ్నపత్రం విధానంలో పరీక్షలు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని నెల రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
డౌన్లోడ్ కాని హాల్ టికెట్లు
పరిష్కారం చూపని రాష్ట్ర ప్రభుత్వం
వేధిస్తున్న సాంకేతిక సమస్యలు
ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు
ఇదీ నిర్లక్ష్యం..
అదిగో ఇదిగో అంటూ సుమారు 11 నెలలు జాప్యం చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు.
ప్రిపరేషన్కు సమయం లేకుండా పరీక్షలు నిర్వహించడంపై ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.
45 రోజులు మాత్రమే ప్రిపరేషన్కు అవకాశం ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
నోటిఫికేషన్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గత నెల 30వ తేదీ నుంచే హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ కావాలి. అయితే డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతోనే షెడ్యూల్ ప్రకారం హాల్టిక్కెట్లు డౌన్లోడ్ కాలేదు.