
ఇంటింటికీ మద్యం సరఫరా ఘనత బాబుది
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా పరిశీలకులు కల్పలతారెడ్డి, అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి
చాగలమర్రి: కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీని రద్దు చేసి ఇంటింటికి మద్యం సరఫరా చేస్తుందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా పరిశీలకులు కల్పలతారెడ్డి, అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. మంగళవారం వారు మాజీ ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, పార్టీ నేత భూమా కిశోర్రెడ్డితో కలిసి తోడేండ్లపల్లె గ్రామాన్ని సందర్శించి ఇటీవల హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ తరఫున రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఊరూరా బెల్ట్షాపులతో మద్యం ఏరులై పారుతుందన్నారు. మద్యం మత్తులో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. తోడెండ్లపల్లె చిన్నారి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న, చంద్రబాబు పాలనలో తేడాను ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధానకార్యదర్శి షేక్ బాబులాల్, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, ఆళ్లగడ్డ ఎంపీపీ రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.