
అంకితభావంతో విధులు నిర్వహిస్తేనే గుర్తింపు
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసినప్పుడే పదవీ విరమణ తర్వాత కూడా గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు వి.రామచంద్రారెడ్డి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించి వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో పీఆర్ డీఈఈగా పదవీ విరమణ పొందిన సూర్యనారాయణరెడ్డిని బుధవారం ఎస్ఈ ఆధ్వర్యంలో పీఆర్ ఇంజనీర్లు ఘనంగా సన్మానించారు. స్థానిక జిల్లా పరిషత్లోని విశ్వేశ్వరయ్య భవన్లోని ఎస్ఈ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈఈ సి.మద్దన్న, డీఈఈలు రవీంద్రారెడ్డి, బండారు శ్రీనివాసులు, హరిదాసు ఈరన్న, కర్రెన్న, మహేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, ఏఈలు విజయభాస్కర్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో పనిచేసిన సూర్యనారాయణరెడ్డి ఎంతో అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. ప్రతి ఒక్కరు తమ విధులను ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సక్రమంగా నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. ముఖ్యంగా సమయపాలన పాటిస్తూ తమ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలన్నారు.