
జనని బ్యాంకు పేరుతో మోసం
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు ● ఇద్దరు అరెస్ట్, రిమాండ్కు తరలింపు
కోవెలకుంట్ల: ఎక్కువ వడ్డీ ఆశ చూపి ప్రజలు సొమ్మును డిపాజిట్ల రూపంలో కట్టించుకుని చివరకు ఓ సంస్థ బోర్డు తిప్పేసి ఖాతాదారులను మోసం చేసింది. ఈ ఘటన కోవెలకుంట్లలో చోటు చేసుకుంది. సీఐ హనుమంతునాయక్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సోమవాండ్లపల్లెకు చెందిన ఆకుల వెంకటరమణ, కోవెలకుంట్ల పట్టణం గడ్డవీధికి చెందిన గువ్వల పద్మావతి మరికొంత మందితో కలిసి 2021లో స్థానిక ఓంశాంతి భవన సమీపంలో జనని మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ పొదుపు, పరపతి సొసైటీని ఏర్పాటు చేశారు. సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మిగతా ప్రైవేట్ బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇస్తామని, డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని నమ్మబలికించారు. వీరి మాటలు నమ్మి కోవెలకుంట్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల కు చెందిన ప్రజలు ఇందులో ఖాతాదారులుగా చేరి లక్షలాది రూపాయాలు డిపాజిట్ల రూపంలో జమ చేశారు. డిపాజిట్లు చేసిన కొంత మందికి లోన్ల రూపంలో డబ్బులు అందజేశారు. ఖాతాదారులు జమ చేసిన సొమ్మును స్వాహా చేసేందుకు కుట్రపన్ని సంస్థకు సీఈఓగా ఉన్న వెంకటరమణ తన వ్యక్తిగత ఖాతాకు నగదు బదిలీ చేయించున్నాడు. ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ ఖాతాదారుల బాండ్లకు గడవు తీరిపోవడంతో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు సొసైటీ వద్దకు వెళ్లగా సంస్థ యాజమాన్యం బోర్డు తిప్పేయడంతో బాధితులు ఈ నెల 4వ తేదీన కోవెలకుంట్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురు ఖాతాదారులు రూ. 13.45 లక్షలు డిపాజిట్లు చేసి మోసపోయినట్లు గుర్తించారు. ఇంకా ఎవరైనా సొసైటీలో డబ్బులు జమ చేసి బాండ్ల కాల పరిమితి తీరిపోయి ఉంటే పోలీసులను సంప్రదించాలని సీఐ పేర్కొన్నారు. డిపాజిట్లపై లోన్లు తీసుకుని తిరిగి చెల్లించని ఖాతాదారులు కూడా ఈ కేసులో నిందితులవుతారని, తీసుకున్న డబ్బులను వెంటనే కట్టాలని హెచ్చరించారు. కేసులో నిందితులైన గువ్వల పద్మావతి, ఆకుల భరద్వాజ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ వివరించారు.