
కోలుకోలేక పంచాయతీ కార్యదర్శి మృతి
గోస్పాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కోలుకోలేక తేళ్లపురి గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బొప్ప సుజాత(31) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 28వ తేదీన విధుల నిమిత్తం తేళ్లపురి గ్రామానికి మరొక పంచాయతీ కార్యదర్శితో కలసి బైక్పై వెళ్తుండగా.. వారి వెనుక వస్తున్న కారు హారన్ కొట్టడంతో భయాందోళనకు గురైన ఆమె బైక్పై నుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ప్రైవే టు ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందు తూ కోలుకోలేక శుక్రవారం ఆమె మృతి చెందారు. పంచాయతీ కార్యదర్శిగా ఆమె మొదట్లో సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పుడు గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శిగా ఉయ్యాలవాడ మండలంలో పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్–4 కార్యదర్శిగా గోస్పాడు మండలం కానాలపల్లెలో పని చేశారు. అనంతరం జరిగిన బదిలీల్లో తేళ్లపురి గ్రామంలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందారు. ఆమె మృతి పట్ల గ్రామస్తులు, ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, పీఎస్లు సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఎంపీడీఓ అమానుల్లా రూ.15 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట ఈఓఆర్డీ నాగఅనసూయ, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.