
స్పెషల్ ‘అదెసివ్’ స్టాంపుల కొరత
● రిజిస్ట్రేషన్ పత్రాల నకలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ● వినియోగదారులపై అదనపు భారం మోపుతున్న అధికారులు ● రూ.50 ఈ–స్టాంపు తెచ్చుకుంటేనే నకళ్లు జారీ చేస్తున్న వైనం
కర్నూలు(సెంట్రల్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఈ–స్టాంపింగ్ పుణ్యమా అని స్టాంపుల కొరత ఏర్పడలేదు. ఈ స్టాంపింగ్ స్టాక్ హోల్డర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తే తప్పా స్టాంపుల కొరత లేదు. అయితే సబ్ రిజిస్ట్రా ర్, రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నకళ్లు, ఈసీలు, ఇతర సర్టిఫైడ్ కాపీలను పొందేందుకు అవసరమైన స్పెషల్ అదెసివ్ (ప్రత్యేకంగా అతికించే) స్టాంపుల కొరత ప్రస్తుతం వేధిస్తోంది. దాదాపు ఐదారు నెలల నుంచి ఆ స్టాంపుల కొరత ఉన్నా రిజిస్ట్రేషన్ శాఖాఽ దికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో రిజిస్ట్రేషన్ పత్రాల నకళ్లు, 1983కు ముందు కంటే ఈసీలు, ఇతర సర్టిఫైడ్ కాపీలను పొందడానికి వీలు ఉంటుంది. అయితే వాటిని పొందడానికి అదెసివ్ స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా, ఆయా పత్రాలను పొందేందుకు నిర్ధేశించిన రుసుంను వసూలు చేస్తున్న అధికారులు స్టాంపుల కొరతను మాత్రం అధిగమించడం లేదు. నకలు పొందాలటే రూ.500, పాత ఈసీలు పొందాలంటే దాదాపు 1200, ఇతర పత్రాలను పొందేందుకు కూడా రూ.500 నుంచి రూ.1000 వరకు రుసుంను వసూలు చేస్తారు. అయితే క్రయ, విక్రయదారులు పొందాలనుకున్న సర్టిఫైడ్ కాపీకి సంబంధించి ప్రత్యేకంగా అంటించే (అదెసివ్) స్టాంపులు లేకపోవడంతో వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. ప్రత్యేకంగా రూ.50 ఈస్టాంపు తెచ్చుకుంటే అవసరమైన కాపీని ఇస్తామని చెబుతున్నారు. దీంతో వినియోగదారుడే మళ్లీ రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే అధికారులు మాత్రం నిర్దేశించిన కాపీకి సంబంధించి మొత్తం రుసుం ఒక పక్క కట్టించుకుని మరో పక్క రూ.50 స్టాంపును అదనంగా కొనుగోలు చేసి తెచ్చుకోవాలని చెబుతుండడంతో మోసపోతున్నారు. కాగా రోజుకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 700–1000 వరకు నకళ్లు, ఈసీలు, ఇతర సర్టిఫైడ్ కాపీల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం వెళ్తుంటారు. దీంతో వారిపై రోజుకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు భారం పడుతుంది. అంటే నెలకు ప్రజలపై రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు అదనపు భారం పడుతుంది.
పట్టించుకోని ప్రభుత్వం...
స్పెషల్ అదెసివ్ స్టాంపుల కొరతపై ప్రభుత్వం నోరుమొదపడం లేదు. దాదాపు 6 నెలలుగా స్టాంపుల కొరత ఉంది. స్థానిక అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇదే సమయంలో క్రయ, విక్రయదారులకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాన్ జుడీషియల్ స్టాంపులను అందుబాటులో ఉంచుతామని చెప్పినా ఒకటి, రెండు నెలలకే స్వస్తి పలికింది. దీంతో ఈ – స్టాంపులే దిక్కయ్యాయి. అయితే ఈ స్టాంపింగ్ స్టాక్ హోల్డర్.. వెండర్లకు అవసరమైన స్టాంపులను సరఫరా చేయడం లేదు. అతను తన ఖాతాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చలాన్ల ను కట్టిస్తేనే ఈ స్టాంపులు ఇస్తానని షరతు విధించి కొందరికే విక్రయిస్తున్నాడు. దీంతో కొన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర అప్పుడప్పుడు స్టాంపుల కొరత నెలకొని క్రయ,విక్రయదారులు ఇబ్బందులు పడుతు న్నారు. నెలలో ఐదారు రోజులపాటు స్టాంపుల కొరత కృత్రిమంగా వచ్చినా సర్దుకు పోతున్నారు.