
ఆటలాడుకుంటూ అనంతలోకాలకు..
● బావిలో పడి బాలుడి మృతి
దేవనకొండ: ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ పదేళ్ల బాలుడు బావిలో పడి మృతిచెందాడు. ఈ దుర్ఘటన నల్లచెలిమల గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీరేష్, కమల దంపతులు సొంత ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పొలం పనులకు వెళ్తూ తమ ఇద్దరు పిల్లల్ని కూడా తమ వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉండగా పక్క పొలంలో పిల్లలతో కలిసి ధనుష్(10) అనే బాలుడు ఆటలాడడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ధనుష్ బావిలో కాలు జారి పడిపోగా, తోటి పిల్లలు కేకలు వేశారు. తల్లిదండ్రులు వచ్చి పిల్లవాడిని బయటికి తీసేలోపు మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మహిళ ఆత్మహత్య
కోవెలకుంట్ల: పట్టణంలోని గుద్దేటి వీధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన అరుణ(51) కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. మృతురాలి కుమారుడు వినయ్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
పనుల్లేక.. ఉరికి వేలాడి!
వెల్దుర్తి: కుటుంబ పోషణకు పనిచేద్దామన్నా ఎవరూ ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి పట్టణం 15వ వార్డులో మల్లిపల్లి సంజీవులు(47) నివాసముంటున్నాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఈయనకు భార్య మల్లేశ్వరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం వివాహమైన కుమార్తెను చూసేందుకు మంగళవారం భార్య, కుమారుడు వెంకట్రాంపల్లె వెళ్లారు. బుధవారం తిరిగి రాగా సంజీవులు ఊరితాడుకు వేళాడుతూ కనిపించాడు. కూలీ పనులు దొరకక, ఆర్థిక ఇబ్బందుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డట్టు మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకని విచారిస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.

ఆటలాడుకుంటూ అనంతలోకాలకు..