
కాంట్రాక్టర్ల కోసమే గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు
● రూ.81వేల కోట్లు పెడితే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం ● ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకరరెడ్డి డిమాండ్
కర్నూలు(సెంట్రల్): కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే గోదావరి – బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతున్నారని, దీనివల్ల వెనుకబడిన రాయలసీమలో ఎలాంటి నీటి కష్టాలు తీరవని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు రూ.81 వేల కోట్ల ఖర్చుతో గోదావరి–బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించి మూడు లక్షల ఎకరాలకుతోడు కొత్తగా మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామని గొప్పలు చెబుతున్నారని, ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడిన రాయలసీమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల కోసమే దీనిని నిర్మించ తలపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లకు నిధులు కేటాయిస్తే ఉపయోగం ఉంటుందన్నారు. 2018లో సీఎంగా ఉన్న సమయంలో వేదవతి ప్రాజెక్టును రూ.2 వేల కోట్లతో నిర్మిస్తామని భూమి పూజ చేసి చంద్రబాబు వదలివేశారని గుర్తుచేశారు. జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన ప్రకారం రూ.4 వేల కోట్లు ఖర్చు పెడితే వెలిగొండ పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో కరువుపీడిత 4 లక్షల ఎకరాలు, 100 గ్రామాలకు తాగునీరు వచ్చే అవకాశం ఉందన్నారు. పల్నాడు జిల్లాలోని వరికెపూడిసెల ఎత్తిపోతల పథకానికి రూ.1300 కోట్లు ఖర్చుపెడితే లక్ష ఎకరాలక సాగునీరు, 100 గ్రామాలకు తాగునీరు ఇవ్వచ్చని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్లను ప్రభుత్వం పట్టించుకోకుండా రూ.81 వేల కోట్లతో గోదావరి–బనకచర్ల చేపడితే కాంట్రాక్టర్లకు లాభం, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీ రైతు సంఘంజిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.