
పండగ పూట విషాదం
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం ● మరో యువకుడికి తీవ్ర గాయాలు
ఆత్మకూరురూరల్: బక్రీద్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. ఆత్మకూరు మండలం నల్లకాల్వ సమీపంలోని వైఎస్సార్ స్మృతివనం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వెలుగోడు పట్టణానికి చెందిన సనావుల్లా(19), సమీర్(20), షేక్షావలి మిత్రులు. వీరు బక్రీద్ పర్వదినం సందర్భంగా స్మృతివనం సందర్శనకు బైక్లో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దారి వెంట వెళుతున్న కొందరు గాయపడిన వారిని వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సనావుల్లా, సమీర్లు మృతి చెందారు. గాయపడిన షేక్షావలికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ నిలుపకుండా పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ రాము, ఎస్ఐ నారాయణరెడ్డి వెలుగోడు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పండగ పూట విషాదం