
మూల పెద్దమ్మ దేవరకు వేళాయె!
● నేటి నుంచి డబ్ల్యూ గోవిందిన్నెలో దేవర ● 11 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న వైనం
దొర్నిపాడు: జిల్లాలో ఎంతో విశిష్టత ఉన్న డబ్ల్యూ గోవిందిన్నె మూల పెద్దమ్మ దేవర నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవానికి గ్రామం ముస్తాబైంది. బంధువులతో అందరి ఇళ్లు కళకళలాడుతున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఒక సారి నిర్వహించే పెద్దమ్మ దేవరను గతంలో కరోనా కారణంగా నిర్వహించలేక పోయారు. 11 ఏళ్ల తర్వాత గ్రామ ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు దేవర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 8వ తేదీ ఆదివారం దేవి ఉత్సవం, 9న సోమవారం అమ్మవారికి గండదీప పూజలు, 10న మంగళవారం ఎల్లమ్మ పూజలు నిర్వహించి దేవరను ముగిస్తారు. గ్రామంలో వెలసిన మూల పెద్దమ్మ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన జూదం వంశీకులు తినడానికి తిండిలేక దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవారు. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం జూదం వంశీకులు కర్నూలు ప్రాంతంలో ఓ బ్రాహ్మణ ఇంట్లో చొరబడి మేదర పెట్టెను అపహరించారు. ఇంటికి వచ్చి అందులో చూడగా మూలపెద్దమ్మ విగ్రహం ఉండటంతో ఆశ్చర్యపోయారు. వారిలో ఒకరికి అమ్మవారు పూని ‘నన్ను ఇక్కడే కొలువుంచండి మీకు సుఖశాంతులు కల్గుతాయి’ అని చెప్పడంతో ఆ ఇంట్లోనే పెద్దమ్మను ప్రతిష్టించుతారు. దీంతో వారి ఇళ్లే పెద్దమ్మ ఆలయంగా మారిందని స్థానికులు చెబుతారు.
మూల పెద్దమ్మ ఎందుకంటారంటే..
ఎక్కడైనా ఆలయాలు చాలా వరకు తూర్పు ముఖం కల్గి ఉండి విగ్రహాలు వాకిటికి ఎదురుగా ప్రతిష్టిస్తారు. ఇక్కడ అలా కాదు. పెద్దమ్మ ఆలయంగా మారిన ఇళ్లు పడమర ముఖం కల్గి ఉంటుంది. జూదం వంశీకులు చోరీ చేసిన పెట్టను మూలకు ఉంచడం, పెద్దమ్మ అక్కడే ఉంచాలని కోరడంతో మూల పెద్దమ్మగా కొలుస్తారు.

మూల పెద్దమ్మ దేవరకు వేళాయె!