
కారు లోపల ఊపిరాడక బాలుడి మృతి
డోన్ టౌన్: కారు డోర్లు లాక్ అయ్యి ఊపిరాడక అందులో ఉన్న ఈశ్వర్(11) అనే బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన బుధవారం దొరపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోహన్, ధనలక్ష్మీ దంపతుల కుమారుడు ఈశ్వర్ ఆడుకుంటూ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళళ్లి డోర్ వేసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత డోర్లు లాక్ అయ్యాయి. డోర్ గ్లాస్లు పూర్తిగా మూసి ఉంచడంతో ఊపిరి ఆడక అచేతనంగా మారాడు. బాలుడు విగతజీవిగా కారులో పడి ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మందగించిన నైరుతి
● జాడ లేకుండా పోయిన వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): ముందస్తుగా ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపడం లేదు. తొలకరి వర్షాలు కనుమరుగయ్యాయి. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. మే నెలలో అధిక వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు కూడా గత నెల 26న విస్తరించాయి. ఈ ప్రభావం వల్ల ఒకటి, రెండు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రుతుపవనాలు విస్తరించిన తర్వాత నుంచి వాటిలో చురుకుతనం తగ్గిపోయింది. గాలి తీవ్రత పెరగడంతో వర్షాలు కురుస్తాయో లేదోననే ఆందోళన నెలకొంది. జూన్ నెల మొదటి నాలుగు రోజుల్లో 1 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ నమోదు కావాల్సి ఉంది. నల్లరేగడి నేలల్లో ఒకే రోజు లేదా మూడు రోజుల్లో 75 మి.మీ వర్షాలు పడినప్పుడు మాత్రమే పత్తి విత్తనాలు విత్తుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో సాధారణ సాగు 4,22,540 హెక్టార్లు. ప్రధానంగా పత్తి సాధారణ సాగు 2,34,409 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 5,066 హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది.