
గుండె పోటుతో మహిళ మృతి
వెల్దుర్తి: ఆసుపత్రికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు స్థానిక పాతబస్టాండ్లోనే గుండెపోటుతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. బోగోలుకు చెందిన గొల్ల అయ్యమ్మ(62) అనారోగ్యంతో బాధ పడుతుండటంతో భర్త అయ్యస్వామి, కుమార్తె, అల్లుడు కలిసి మంగళవారం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో వెల్దుర్తికి చేరుకున్నారు. పాతబస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా తీవ్ర అస్వస్థతకు గురై అయ్యమ్మ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు, డ్యూటీ పోలీసుల సాయంతో స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా పాతబస్టాండులో బస్షెల్టర్ ఉన్నా ప్రయాణికులకు అనుకూలంగా లేకపోవడంతో బస్సుల కోసం ఎండా, వానల్లో నిలుచుని ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే కోవలో అయ్యమ్మ కూర్చునేందుకు అవకాశం లేకపోవడంతో నిలుచొని ఉండటంతో అసలే అనారోగ్యంతో ఉన్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికారులు పాతబస్టాండులో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.