
చెట్నహళ్లిలో అంత్యక్రియల వివాదం
మంత్రాలయం రూరల్: చెట్నహళ్లి గ్రామ శ్మశాన వాటికలో అంత్యక్రియల విషయం రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది. తమ ఇళ్లను అనుకుని ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించరాదని కొందరు అడ్డుకుంటున్నారు. మరికొందరు మాత్రం తమకు వేరే స్థలం లేదని అక్కడే అంత్యక్రియలు చేపడతామన్నారు. రెండు నెలలుగా ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శనివారం ఉదయం శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలిసి కొందరు గ్రామంలోని 167వ జాతీయ రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్ల వద్ద అంత్యక్రియలు చేయొద్దంటూ నినదించారు. విషయం తెలుసుకున్న సీఐ రామాంజులు సంఘటన స్థలానికి వెళ్లి ఆందోళనకారులను శాంతింపజేశారు.