
మంత్రి అనుచరులకే ‘దేవ’ భూములు!
కర్నూలు (టౌన్): విలువైన దేవదాయ భూములను కర్నూలులో తక్కువ ధరకు మంత్రి తన అనుచరులకు ఇప్పిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవదాయ భూములను లీజు పేరుతో స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ఈ భూము ల విషయంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయినా క్యాబినెట్ దృష్టికి తీసుకుపోకుండా దొడ్డిదారిన జీవో తెచ్చారన్నారు. ధార్మిక సంస్థలు, ఎన్జీల ముసుగులో టీడీపీ నేతల అనుచరులకు ఈ భూములను అప్పగిస్తున్నారన్నారు. తాము 20 సంవత్సరాలుగా సాంస్కృతిక విభాగంలో ఎన్నో సేవలు చేస్తున్నామని తమకు ఈ భూములు లీజుకు ఇస్తారా అని ప్రశ్నించారు.
అడ్డగోలుగా భూముల దోపిడీ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూములను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఎస్వీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సనాతన వాది పేరుతో గుళ్లు గోపురాలు తిరిగిన ఆయన దేవదాయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.
న్యాయ పోరాటం
టీడీపీ నేతలు దోచుకుంటున్న దేవదాయ భూములపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతుందని ఎస్వీ అన్నారు. దేవదాయ భూముల లీజు ప్రక్రియను రద్దు చేయాలన్న డిమాండ్తో హైకోర్టును ఆశ్రయిస్తున్నామన్నారు. జూన 4న నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ నిరసనలో దేవదాయ భూముల లీజు వ్యవహారంపై ఆందోళనలు చేపడతామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్పొరేటర్ షేక్ యూనుస్బాషా, రెడ్డిపోగు ప్రశాంత్, ఫిరోజ్, మహిళ నాయకులు మంగమ్మ, భారతి పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి