
భవితనివ్వని ‘ఉన్నత విద్య’
ప్రశ్నార్థకంగా యూనివర్సిటీలు
● గత ఏడాది భారీగా పడిపోయిన పీజీ అడ్మిషన్లు ● 35 కోర్సులకు అందుబాటులో 2,017 సీట్లు ● 759 సీట్లు మాత్రమే భర్తీ ● ఉపాధి చూపే కోర్సులతోనే వర్సిటీలకు భవిష్యత్తు ● గత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను తొక్కిపెట్టిన కూటమి ప్రభుత్వం
కర్నూలు కల్చరల్: యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కాలం తీరిన కోర్సులు.. ఉపాధి చూపని కోర్సులతో వర్సిటీల్లో సీట్ల భర్తీ గగనమవుతోంది. ఉన్న సీట్లలో సగం కూడా భర్తీకాకపోవడం విద్యార్థుల్లో అనాసక్తికి నిదర్శనం. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే మూడు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో 35 కోర్సులుంటే 37.63 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. చదివే సబ్జెక్టుకి, అవకాశాలకు పొంతన లేకపోవడంతో ఉన్నత విద్యా రంగం భవిష్యత్ అగమ్యగోచరం అవుతోంది. గత ప్రభుత్వం ఉన్నత విద్యా విధానంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా కూటమి ప్రభుత్వం తొక్కి పెట్టింది. వర్సిటీలకు పరిశ్రమలను అనుసంధాన చేయడం, హానర్స్ కోర్సుల రూపకల్పన తదితర చర్యలు చేపట్టినా ప్రస్తుతం ఆ ఊసే కరువైంది. ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది జూన్ 9వ తేదీ నుంచి పీజీ ప్రవేశాలకు పీజీసెట్–2025 నిర్వహిస్తోంది. అయితే నూతన కోర్సుల రూపకల్పన, ఉపాధినిచ్చే కోర్సుల్లో అప్గ్రేడేషన్ చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఫలితంగా ఈ ఏడాది కూడా 40 శాతం సీట్లు కూడా భర్తీ అయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ లోపాలు..
జీఓ 77తో ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తొలగించడం.
డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ కోర్సులను ప్రవేశ పెట్టడం.
థియరిటికల్ పార్ట్ అధికంగా ఉండి ప్రాక్టికల్ పార్ట్ తక్కువగా ఉండటం.
అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం.
జోనల్ సిస్టమ్ ఉన్న రాష్ట్రంలో కామన్ పీజీ సెట్ నిర్వహించడం.
మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల్లో అప్గ్రేడేషన్ లేకపోవడం.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.
వర్సిటీల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడం.
ఆన్ డిమాండ్ కోర్సులను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం.
రీసెర్చ్ ఫెసిలిటీస్ లేకపోవడం.
ప్లేస్మెంట్ సెల్స్ను పటిష్టం చేయాలి
యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్ సెల్స్ను పటిష్టం చేయాలి. పరిశ్రమలు, వివిధ కంపెనీల భాగస్వామ్యం లేకపోవడంతో పీజీ విద్యార్థులకు ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రం మొత్తం కామన్ పీజీ సెట్ కాకుండా వర్సిటీలు సొంతంగా ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవాలి. సింగిల్ మేజర్, మైనర్ సబ్జెక్టుల గందరగోళ వ్యవస్థకు బదులుగా మూడు సంవత్సరాల యూజీ పోగ్రామ్ను కొనసాగించడం ఉత్తమం.
– ఎస్.మన్సూర్ రహమాన్, విశ్రాంత ప్రొఫెసర్, కర్నూలు

భవితనివ్వని ‘ఉన్నత విద్య’