
తూకాల్లో తేడాలు రానివ్వొద్దు
కర్నూలు(సెంట్రల్): తూకాల్లో తేడాలు రాకుండా నిత్యావసరాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా తేడాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ స్థానిక చాణక్యపురిలోని ఎంఎల్ఎస్ పాయింట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న టేక్ హోం రేషన్లోని కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్ల నాణ్య త, తూకాలు తీసే యంత్రాలను పరిశీలించారు. అంతేకాక స్టాక్ పాయింట్లో ఏ ఆహార పదార్థం ఎంత ఉందో ఉన్న రిజిస్టర్లు, అధికారుల తనిఖీల విషయాలపై ఆరా తీశారు. సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ డీఎం నాగసుధ, డీఎస్ఓ రాజారఘువీర్, అసిస్టెంట్ మేనేజర్ పరిమళ పాల్గొన్నారు.
నేడు ఆదోనిలో గ్రహణమొర్రి స్క్రీనింగ్ శిబిరం
కర్నూలు(హాస్పిటల్): పెదవి, అంగిలి చీలిక(గ్రహణమొర్రి) శస్త్రచికిత్సలకు ఈ నెల 28న ఆదోని ప్రభత్వాసుపత్రి ఆవరణలోని జిల్లా సత్వర చికిత్స కేంద్రం(డైస్)లో ఉచితంగా స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సత్యవతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. నోరు, ముఖ, దవడ ఎముకల శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ ఎ.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
సుంకేసులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
కర్నూలు సిటీ: తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసులకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. గత వారం రోజులుగా సుంకేసుల బ్యారేజీకి ఇన్ఫ్లో ఉంటోంది. మంగళవారం ఎగువ నుంచి బ్యారేజీకి 4,462 క్యుసెక్కుల నీరు వచ్చి చేరింది. ఈ నీటిని రెండు గేట్లు అర్ధ మీటర్ పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 159 క్యుసెక్కుల నీరు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని తాగునీటి అవసరాలకు విడుదలవుతోంది.
అగ్నిమాపక శాఖలో బదిలీలకు మార్గదర్శకాలు
కర్నూలు: అగ్నిమాపక శాఖలో బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జూన్ 2వ తేదీ లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలను పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఒకే స్టేషన్లో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి తప్పనిసరిగా బదిలీ కానుంది. ఫైర్మెన్లు, డ్రైవర్, ఆపరేటర్లు, లీడింగ్ ఫైర్మెన్లను ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు బదిలీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 అగ్నిమాపక శాఖ స్టేషన్లు ఉండగా బదిలీలకు సుమారు 40 మంది దాకా అర్హులుగా గుర్తించినట్లు సమాచారం.
న్యాయ సహాయం పొందండి
నంద్యాల(వ్యవసాయం): మానసిక వికలాంగుల సంక్షేమ కోసం న్యాయ సహాయం అందించేందుకు ఎల్ఎస్యూఎం కమిటీని ఏర్పా టు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి బి.లీలా వెంకటశేషాద్రి అన్నా రు. నంద్యాల శివారు ప్రాంతంలోని శాంతిరాం ఆసుపత్రిలోని మానసిక వికలాంగుల విభాగాన్ని మంగళవారం ఆయన లీగల్ సర్వీస్ యూనిట్ ఫర్ మావోనియా కమిటీ సభ్యులతో కలసి తనిఖీ చేశారు. అనంతరం వార్డులోని మానసిక వికలాంగులతో కలిసి మాట్లాడుతూ వారి ఆరోగ్యాల గురించి తెలుసుకుని, న్యాయపరమైన హక్కుల గురించి వారికి తెలియజేశారు. ఆయన వెంట న్యాయవాదులు శేషసాయి, జీవన్ కుమార్, శాంతిరాం హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వసంత్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ పీఎస్ మూర్తి, డాక్టర్ సింధూ, రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

తూకాల్లో తేడాలు రానివ్వొద్దు