
వలస బాటలో విప్లవ అడుగులు
నేడు అంత్యక్రియలు
మావోయిస్టు సంగీత అంత్యక్రియలను ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబకాష్ విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ఎస్డీపీఐ నాయకులు జహంగీర్, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ భాస్కరరెడ్డి, విరసం బాధ్యులు నాగేశ్వర ఆచారి పాల్గొన్నారు.
కర్నూలు(సెంట్రల్)/ఆత్మకూరురూరల్: ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా ఆంబూజ్ మాడ్లో ఈనెల 21న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల్లో ఆస్పరి మండలం ములుగుంద గ్రామానికి చెందిన మహిళ ఉంది. గ్రామానికి చెందిన మాదిగ దుబ్బన్న, ఎస్తేరమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కాగా వారిలో పెద్ద కుమార్తె లలిత అలియాస్ సంగీత ఒకరు. కుటుంబ పోషణ కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లిన లలిత మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితురాలైంది. మొదట ఆమె బతుకు దెరువు కోసం హైదరబాద్కు వెళ్లి అక్కడే కుల నిర్మూలన పోరాట సమితిలో పనిచేసింది. ఆ తరువాత సంగీతగా పేరు మార్చుకొని మావోయిస్టు ఉద్యమంతో పరిచయమై పూర్తిస్థాయి పార్టీ కార్యకర్తగా ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్లిపోయి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసింది. ఈ క్రమంలో చీరాలకు చెందిన సజ్జా నాగేశ్వరావు సహచరిగా ఆమె మారినట్లు తెలుస్తోంది. సంగీత నర్సింగ్లో శిక్షణ పొంది పార్టీ కార్యకర్తలు, ఆదివాసీలకు వైద్య సేవలు అందించినట్లు సమాచారం. ఈమె మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు కార్యాలయ (మొబైల్) సిబ్బందిలో ఒకరుగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్లో మృతి చెందడంతో పోలీసులు ఆరా తీయగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుంద గ్రామానికి చెందిన మహిళగా శనివారం గుర్తించారు. 20 ఏళ్ల క్రితం వలస వెళ్లిన మహిళ చివరకు విగతజీవిగా తిరిగి వస్తుండటంతో గ్రామంలో కొందరు విషాదంలో మునిగారు.