
ఆ ముగ్గురు డిస్మిస్కు రంగం సిద్ధం!
తిరుమల ఘటనను సీరియస్గాతీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు
దురలవాట్లు ఉన్నపోలీసుల గుండెల్లో రైళ్లు
జాబితా సిద్ధం చేస్తున్న ఏపీఎస్పీ ఉన్నతాధికారులు
సంఘటనపై ఐజీ రాజకుమారి ఆరా
కర్నూలు: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిన పోలీసులే మద్యం మత్తులో హంగామా చేసిన సంఘటనను పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి ఆ ముగ్గురిని సర్వీస్ నుంచి తొలగించాలని (డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ ) ఆదేశించినట్లు కర్నూలు ఏపీఎస్పీ 2వ పటాలంలో చర్చ జరుగుతోంది. కర్నూలు 2వ పటాలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్నాయక్, కానిస్టేబుళ్లు రాజశేఖర్, సిరాజుద్దీన్ను క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద రెండు రోజుల క్రితం పటాలం కమాండెంట్ సస్పెండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం సేవించడం నిషిద్ధం, నిషేధిత వస్తువులు కూడా తీసుకువెళ్లకుండా రెండు చోట్ల తనిఖీ కేంద్రాల్లో పరిశీలన జరుగుతుంది.
ఆ పైనే తిరుమలకు అనుమతి ఉంటుంది. ఇంత పటిష్ట భద్రత ఉన్నా, తీవ్ర మద్యం మత్తులో ఆ ముగ్గురు తిరుమల వరకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లడంతో రాష్ట్ర పోలీస్ బాస్ సీరియస్గా భావించి బెటాలియన్ ఐజీ రాజకుమారితో చర్చించి సర్వీస్ నుంచి వారిని తొలగించాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు పటాలం సిబ్బంది చర్చించుకుంటున్నారు. సంఘటన జరిగిన మరుసటి రోజే ఐజీ కర్నూలు పటాలం కమాండెంట్తో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మద్యం తాగి తిరుమలకు చేరుకున్న ముగ్గురిలో ఇద్దరిని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటనా స్థలం నుంచి ఒకరు పారిపోయారు. ఈ సంఘటనపై తిరుమల పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు సమాచారం. మూడు నెలల పాటు శ్రీవారి ఆలయం ముందు గార్డ్ డ్యూటీ నిర్వహించేందుకు ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు తిరుమలకు వెళ్లారు. అయితే, మూడు రోజుల క్రితం ఇన్చార్జ్ ఆర్ఐకి సమాచారం లేకుండా పోలీసు వాహనంలో తిరుపతికి వెళ్లి మద్యం తాగి రావడాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ముస్లిం వ్యక్తి తిరుమలలో నమాజ్ చేసిన ఘటన జరిగిన మరుసటి రోజే కర్నూలు పోలీసులు మద్యం సేవించి హల్చల్ చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు సంఘటనను సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశించారు. వీరు ముగ్గురు 2013లో ఏపీఎస్పీ 2వ పటాలంలో కానిస్టేబుళ్లుగా విధుల్లో చేరారు. సిరాజుద్దీన్ గతంలో కూడా తెలంగాణ నుంచి మద్యం తీసుకొని పటాలంలోకి వెళ్తూ పోలీసులకు పట్టుబడి ఆరు మాసాల పాటు సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఇద్దరిపై కూడా గతంలో ఏవైనా రిమార్కులు ఉన్నాయా, అనే కోణంలో ఆ శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
కంపెనీ ఇన్చార్జీలతో కమాండెంట్టెలి కాన్ఫరెన్స్
ఏపీఎస్పీ పటాలంలో పనిచేస్తున్న సిబ్బంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బందోబస్తు విధులు నిర్వహిస్తుంటారు. విజయవాడ కనకదుర్గమ్మ, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే క్వార్టర్స్ బందోబస్తు విధులకు వెళ్తుంటారు. వీఐపీలకు భద్రత ( గన్మెన్ ) విధులకు కూడా వెళ్తుంటారు. తిరుమల సంఘటన నేపథ్యంలో పటాలంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో ఎంతమందికి మద్యం సేవించే అలవాటు ఉంది, విధుల పట్ల అలసత్వం వహిస్తున్న వారు, గతంలో క్రమశిక్షణ చర్యలకు గురైన వారు, తదితర విషయాలపై జాబితా సిద్ధం చేయాలని కమాండెంట్ కంపెనీ ఇన్చార్జీలకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మద్యం అలవాటు ఉన్న పోలీస్ సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సంఘటనపై గత మూడు రోజులుగా పటాలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆత్మకూరులో పోలీస్ స్టేషన్పై గతంలో దాడి జరిగిన సంఘటనలో ఇదే పటాలానికి చెందిన ఓ కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్లు తేలడంతో అతడిని సర్వీస్ నుంచి తొలగించారు. ఇప్పుడు కూడా ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుమలలో మద్యం మత్తులో హంగామా చేసిన ఆ ముగ్గురిని కూడా సర్వీస్ నుంచి తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు పటాలం సిబ్బందిలో చర్చ జోరుగా సాగుతోంది.