
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. శ్రీమఠం తలుపులు తెరకముందే వేకువజాము నుంచే దర్శనానికి వేలాది మంది బారులు తీరారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీమఠం వీధులన్నీ కిక్కిరిశాయి. రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. మంచాలమ్మ, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిక్కిరిశాయి.
సుంకేసులకు ఇన్ఫ్లో
కర్నూలు సిటీ: తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సుంకేసుల జలాశయానికి ఇన్ఫ్లో వస్తోంది. ఆదివారం బ్యారేజీకి ఎగువ నుంచి 8,908 క్యుసెక్కులు ఇన్ఫ్లో ఉండగా దిగువకు 8,749 క్యుసెక్కుల విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి అవసరాల కోసం కేసీ కాలువకు 159 క్యుసెక్కుల నీరు వదిలారు.
రేషన్ బియ్యం పట్టివేత
గోనెగండ్ల: ఆదోని నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గోనెగండ్లలో ఆదివారం పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్ఐ నరేంద్ర భూపతి, సివిల్సప్లై డీప్యూటీ తహసీల్దార్ మహేష్ తెలిపిన వివరాల మేరకు.. ఆదోనికి చెందిన రామ్ యాదవ్ గ్రామాల నుంచి 240 ప్యాకెట్ల రేషన్ బియ్యంను సేకరించారు. లారీలో ఆదోని నుంచి కర్నూలుకు తరలిస్తున్నట్లు సమాచారం గోనెగండ్లలో పట్టుకున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. రామ్ యాదవ్తో పాటు డ్రైవర్ వీరేష్పై గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రీశైలంలో 39.5 టీఎంసీలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 39.4936 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 818.20 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఎగువ సుంకేసుల ప్రాజెక్ట్, లోకల్ క్యాచ్మెంట్ నుంచి 8,942 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. జలాశయం నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పాదన అనంతరం 7,259 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 3.366 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. డ్యాం పరిసర ప్రాంతాలలో 2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఉంచి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
కొండ నిండా భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రత్యేక సమయాల్లో స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు.

శ్రీమఠంలో భక్తుల రద్దీ

శ్రీమఠంలో భక్తుల రద్దీ

శ్రీమఠంలో భక్తుల రద్దీ