
ధ్వజారోహణం.. దేవతాహ్వానం
ఆళ్లగడ్డ: సత్యలోకానికి సంకేతంగా కోటి సూర్యతేజస్సుతో వెలిగిపోయే గరుడ ఆళ్వార్లను మంత్రపూర్వకంగా ఆహ్వానించే ధ్వజారోహణం.. తనువు మనసు పులకించిపోతుండగా దేవదేవుడి వాహనమైన గరుత్మంతుని ద్వారా దేవతలను ఆహ్వానించే దేవతాహ్వానం.. భేరీపూజ.. లను ఎగువ అహోబిలంలో శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహా పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలేశుని నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. అంతకుముందు ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత జ్వాలా నరసింహుడిని, గరత్ముంతుని సూర్యాస్తమయానికి ముందే పంచామృతాలతో అభిషేకించి పట్టు పీతాంబరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి విడివిడిగా పల్లకీలో కొలువుంచి ఆస్థాన విధ్వాంశుల మంగళవాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ మొదటి జియర్ ఆదివన్ షఠకోపన్ ఉత్సవ విగ్రహం ఎదురుగా ఉంచి లక్ష్మీనృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేసి మంత్ర పూర్వకంగా పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన జ్వాలానృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని విశ్వాసం. స్వామి, అమ్మవార్లను ఆశీర్వదించేందుకు వచ్చే ముక్కోటి దేవతలతో పాటు బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా గరుత్మంతుడు కాపలా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.
సింహ వాహనాధీశా.. నమో నారసింహా!
అహోబిల లక్ష్మీనరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జ్వాలానృసింహస్వామి సింహవాహనం అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యపూజల అనంతరం విశేషాలంకరణ గావించిన సింహవానంపై కొలువైన స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు.
సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణం
పట్టు పీతాంబరాలు.. వజ్రవైఢూర్యాలు ధరించి కొలువుదీరిన దేవతామూర్తులు

ధ్వజారోహణం.. దేవతాహ్వానం

ధ్వజారోహణం.. దేవతాహ్వానం