
ఎంపీడీఓలకు మండలాలు కేటాయింపు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఎంపీడీఓలు గా పదోన్నతులు పొందిన పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలకు మండలాలు కేటాయించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాలకు నియమితులైన ఎంపీడీఓలకు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా సీఈ ఓ నాసరరెడ్డి మాట్లాడుతూ బీవీ రమణారావును దేవనకొండ, బీ నూర్జహాన్ను మంత్రాలయం, కె.విజయశేఖర్రావును కౌతాళం, జి.ప్రభావతిదేవిని పెద్దకడుబూరు, ఎ.మద్దిలేటి స్వామిని ఆలూ రుకు నియమించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఉచిత విద్య ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు
కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఉచిత విద్యను అందించే జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు గడువులోపు తమ వివరాలను విద్యాశాఖ వెబ్సైట్ htts://cse.ap.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులు మే నెల 2 నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్సీ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేది నాటికి ఐదేళ్ల వయస్సు, స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు జూన్ 1వ తేది నాటికి ఐదేళ్ల వయస్సు నిండిన పిల్లలు దరఖాస్తుకు అర్హులన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా వచ్చే నెల 20 నుంచి 24వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశాలకు అర్హతల ఆధారంగా లాటరీ తీస్తామన్నారు. 29న లాటరీ ఫలితాలను విడుదల చేసి, జూన్ 8వ తేదీన ప్రవేశాల నిర్ధారణ చేస్తారని, రెండో విడత జూన్ 11న సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేసి, 18న ప్రవేశాల నిర్ధారణ చేస్తామన్నారు.
బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు 392 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన పరీక్షలకు 392 మంది గైర్హాజరయ్యారు. 3,384 మందికి 2,992 మంది ఛాత్రోపాధ్యాయులు హాజరు కాగా 392 మంది గైర్హాజరయ్యారని, వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు తెలిపారు.
ఏఓలుగా ముగ్గురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న ముగ్గురికి పరిపాలన అధికారులుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదోన్నతి పొందిన వీవీ రామసుబ్బయ్యను ఆళ్లగడ్డ మండల పరిషత్కు, ఎం.మహమ్మద్ హక్ను కల్లూరు ఎంపీపీకి, ఎ.మధుసూదనయ్యను జూపాడుబంగ్లా మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించామన్నారు.
డీసీసీబీ, డీసీఎంఎస్లకు చైర్మన్లు
● డీసీసీబీ చైర్మన్గా ఎదురూరు
విష్ణువర్ధన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్గా
నాగేశ్వరరావు యాదవ్
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు చైర్మన్లను ప్రకటించింది. సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్లకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలాఉంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా కోడుమూరు నియోజకవర్గం ఎదురూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత డి.విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా డోన్ నియోజక వర్గం చండ్రపల్లి గ్రామానికి చెందిన జి.నాగేశ్వరరావు పేర్లను ప్రకటించారు. అయితే జీవోలు విడుదల కావాల్సి ఉంది.