కర్నూలు(అగ్రికల్చర్): కందుల ధర జోరు మీద ఉంది. 2023–24 సంవత్సరం మొత్తం కందుల ధర ఆకాశాన్నంటింది. ఏప్రిల్ నెలలో కూడా ధరల పెరుగుదల కొనసాగుతోంది. వర్షాభావం వల్ల వివిధ పంటల్లో దిగుబడులు పడిపోయిన నేపథ్యంలో రైతులకు ధరలు ఊరట నిస్తున్నాయి. శనివారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల ధర మరింత పెరగడం విశేషం. మార్కెట్కు 102 మంది రైతులు 351 క్వింటాళ్ల కందులు తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.1,002, గరిష్ట ధర రూ.10,761.. సగటు ధర రూ.10,681 పలికింది. ఈ నెల 4న గరిష్ట ధర రూ.10,401 ఉండగా.. మోడల్ ధర రూ.10,226 నమోదైంది. 4వ తేదీతో పోలిస్తే కందుల ధరలు మరింత పెరిగాయి. మార్కెట్కు కందులు తెచ్చిన రైతులందరికి రూ.10వేలపైనే ధర లభించినట్లు స్పష్టమవుతోంది.
డిగ్రీ 3, 5 సెమిస్టర్
ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వర్సిటీ వీసీ సుధీర్ ప్రేమ్కుమార్ ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. మూడో సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థులు 5,900 మందికిగాను 3,081 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 9,140 మందికి 4,182 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఐదో సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థులు 10,080మందికి గాను 5,652 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 4,244 మందికి 2,229 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. పరీక్షల ఫలితాలు htpp://rayalaseemauniversity. ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
వెటర్నరీ అంబులెన్స్ల్లో డ్రైవర్ పోస్టుల భర్తీకి చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ ఆరోగ్య సేవ వెటర్నరీ అంబులేటరీ సర్వీస్ (1962)లలో డ్రైవర్(పైలెట్) పోస్టులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా జీవీకే ఈఎంఆర్ఐ జిల్లా మేనేజర్ రామకృష్ణగౌడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి చదివి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, 36 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వేతనం నెలకు రూ.10800, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉంటుందని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 9014774741, 9603120997 నంబర్లకు పోన్ చేయాలని సూచించారు.
‘టెక్నికల్’ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శామ్యూల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్టణం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురం జిల్లా ల్లో మే నెల 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 25వ తేదీలోపు ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్ www.bse.ao.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆర్యూ విద్యార్థులకు ఆరు రోజులు సెలవు
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు వరుసగా ఆరు రోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగుల అంకన్న ఉత్తర్వులు జారీ చేశారు. 9వ తేదీ ఉగాది, 10న ఆప్షనల్ హాలిడే, 11న రంజాన్, 12న ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. 13వ తేదీ రెండో శనివారం, 14 ఆదివారం ఇలా వరుసగా ఆరు రోజులు సెలవులు వచ్చాయి. 15వ తేదీ వర్సిటీలో తరగతులు పునః ప్రారంభం కానున్నాయి.