
రైలు నుంచి జారి పడి యువకుడి మృతి
● ఎడమ చేతిపై గుజరాతీ భాషలో
పచ్చబొట్టు
ఆదోని సెంట్రల్: రైలు నుంచి జారిపడి గురువారం ఒక యువకుడు మృతి చెందాడు. అతను ఎవరో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో, ఏ రైలు నుంచి జారీ పడ్డాడో పూర్తి సమాచారం దొరక లేదని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాయి సర్వేశ్వరరావు తెలిపారు. మృతదేహం ఆదోని–ఇస్వి అర్ఎస్ల మధ్య కనిపించిందని చెప్పారు. మృతుడి ఎడమ చేతిపై గుజరాతీ భాషలో పచ్చబొట్టు ఉందని, గుర్తుపట్ట కలిగిన వారు తమను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సిమ్ బ్లాక్ చేసి.. డబ్బు కాజేసి!
దేవనకొండ: ఫోన్ సిమ్ను బ్లాక్ చేసి.. ఫోన్పే ద్వారా డబ్బు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేవనకొండ మండలంలోని తెర్నేకల్ గ్రామానికి చెందిన శాలుబి(62) అనే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శాలుబీకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఖాతాలో పంటల ఇన్సూరెన్స్ బీమా, ఎల్ఐసీ ఇన్సూరెన్స్కు సంబంధించిన రూ.60 వేలు, పొదుపు లోన్ తీసుకున్న రూ.1.50 లక్షలు మొత్తం రూ.2 లక్షలు దాకా సేవింగ్ ఖాతాలో ఉంది. ఈమె ఫోన్ నంబర్తో బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం ఉంది. అదే ఫోన్ నంబర్తో ఫోన్పే ఉంది. ఈనెల 7వ తేదీన ఈమెక ఫోన్కు చెందిన సిమ్ బ్యాక్ అయ్యింది. 16వ తేదీ కొత్త సిమ్ తీసుకుని యాక్టివేట్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.2 లక్షలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె బ్యాంకుకు వెళ్లి సంప్రదించగా ఈనెల 8వ తేదీన రూ.లక్ష, 9వ తేదీన రూ.లక్ష ఫోన్ పే ద్వారా డ్రా చేసినట్లు స్టేట్మెంట్లో బయటపడింది. దీంతో ఒక్కసారిగా విస్తుపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో
19న ‘స్పాట్’ అడ్మిషన్లు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్స్, బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈనెల 19న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ మైనార్టీ కాలేజీ ప్రిన్సిపాల్ వీ.ఎస్.వీ.సీహెచ్ శ్రీనివాస ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని నేరుగా హాజరుకావొచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9912342098ను సంప్రదించవచ్చునని తెలిపారు.