ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్ర కీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఎండల తీవ్రత రోజు రోజుకు అధికం కావడంతో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో రద్దీ అధికంగా కనిపిస్తోంది. ఘాట్రోడ్డుతో పాటు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా విచ్చేసిన భక్తులు రూ.300, రూ.100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రూ.500 టికెట్ల విక్రయాలు నిలిపివేయడం ద్వారా దేవస్థాన అంతరాలయ దర్శనం నిలిపివేసి బంగారు వాకిలి ద్వారా దర్శనానికి అనుమతించారు.
దుర్గమ్మ సన్నిధికి కొనసాగుతున్న రద్దీ


