పెడన: విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు, కవయిత్రి, రచయిత్రి, స్టాంపుల సేకర్త పుట్టి నాగలక్ష్మికి అమృతలత అపురూప అవార్డు–2026 లభించింది. పెడన మండలం దావోజిపాలెంకు చెందిన ఈమె వృత్తిరీత్యా గుడివాడలో స్థిరపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలోని నందమూరి తారకరామారావు కళానిలయంలో ‘అమృతలత–అపురూప అవార్డును పోస్టల్ స్టాంపుల సేకరణ విభాగంలో నాగలక్ష్మికి మంగళవారం అందించారు. తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్స్ డిస్ప్యూట్స్ రిడ్రెసెల్ కమిషన్ తొలి మహిళా అధ్యక్షురాలు జస్టిస్ డాక్టర్ జి. రాధారాణి, ప్రముఖ సినీనటి, ప్రఖ్యాత నృత్య కళాకారిణి మంజుభార్గవి కలిసి అవార్డును నాగలక్ష్మికి అందజేశారు.
నాగాయలంక: మండలంలోని గుల్లలమోద ప్రధాన మార్గంలో ఏటిమొగ నుంచి నాగాయలంక వైపు కారులో వస్తుండగా మంగళవారం తెల్లవారు జామున 3.30గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఆ కారు పంట కాలువలోకి దూసుకువెళ్లినట్లు ఎస్ఐ కలిదిండి రాజేష్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు బొమ్మిడి చంద్రబాబు(23), షేక్ ఫాతిమున్నీసా(19)లకు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ తమ్ము చైతన్య క్షేమంగా బయటపడ్డాడని ఆయన చెప్పారు. ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కారు బలంగా చెట్టుకు ఢీకొట్టిన తర్వాతే కాలువలోకి దూసుకు పోయుంటుందని స్థానికులు చెబుతున్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆటోడ్రైవర్ ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గుణదల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మధురానగర్ సాయిబాబా కాలనీకి చెందిన చందల కిషోర్ బాబు ఇంట్లో అతని మామయ్య కొడుకు గంటల వరుణ్ కుమార్(23) నివసిస్తున్నాడు. వరుణ్ కుమార్కు తల్లిదండ్రులు లేకపోవడంతో కిషోర్ దగ్గర పెరుగుతూ వచ్చాడు. వరుణ్ ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మద్యం ఎక్కువగా తాగుతున్నాడు. ఈనెల 9న కిషోర్ బాబు ఏలూరులో బంధువుల ఇంటికి కుటుంబంతో వెళ్తూ వరుణ్ని ఇంట్లోనే ఉండమని చెప్పాడు. ఉదయం అతనికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఒకసారి వాళ్ల మామయ్యను ఇంటికి పంపించి చూడగా బెడ్రూంలో ఫ్యాన్కి ఉరి వేసుకొని ఉన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


