పెనమలూరు: మండలంలోని కానూరుకు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు గిన్నిస్వరల్డ్ రికార్డు సాధించారు. గత ఫిబ్రవరి రెండో తేదీన హైదరాబాద్లో 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు గంటపాటు కీబోర్డు ప్లే చేశారు. విజయవాడలోని హెల్లెల్ మ్యూజిక్ స్కూల్లో శిక్షణ పొందిన కానూరుకు చెందిన దంపతులు పాతూరి సురేష్బాబు, స్వర్ణలత తమ కుమార్తె షయాఫేత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎంపికయ్యారు. హెల్లెల్ మ్యూజికల్ స్కూల్లో రెండు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో వారికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..
ఇద్దరికి గాయాలు
చల్లపల్లి: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని వక్కలగడ్డ ఐదో నంబర్ కాలువ వద్ద చల్లపల్లి–పామర్రు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. చల్లపల్లి నారాయణరావునగర్కు చెందిన 70 ఏళ్ల పాస్టర్ కె.రాజేంద్ర ప్రసాద్ ద్విచక్రవాహనంపై దళితవాడ నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన యువకుడు అనిల్ బైక్పై చల్లపల్లి నుంచి వక్కలగడ్డ వైపు వెళ్తున్న క్రమంలో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. రాజేంద్రప్రసాద్కు కాలు విరిగి తలకు బలమైన గాయమైంది. అనిల్కు కూడా గాయాలయ్యాయి. చల్లపల్లి 108 ఈఎంటీ దాసి బసవరాజు, పైలెట్ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాస్టర్ రాజేంద్రప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. కొంతసేపటి తరువాత అనిల్ను కూడా మరొక అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


