ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్
చల్లపల్లి: రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు కౌలురైతు చట్ట సవరణ చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు అమలు చేయటంలేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ ప్రశ్నించారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఏపీ రైతుసంఘం రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలురైతుల రక్షణకు, సంక్షేమానికి నూతన కౌలు చట్టం తీసుకురావాలని, 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, రెండు లక్షల వరకూ ష్యూరిటీలేని రుణాలు ఇవ్వాలని డిమాండు చేశారు. కౌలురైతులకు ఇచ్చే గుర్తింపు కార్డులు గ్రామ సభల ద్వారా అందజేయాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రైతు సంఘాల్లో యువతకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర సమితి సమావేశాలు ముగింపు సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. సమావేశాల్లో రైతుసంఘం రాష్ట్ర నాయకులు మలినీడు యలమందరావు, హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ, కాటమయ్య, పి.జమలయ్య, గుత్తికొండ రామారావు తదితరులు ప్రసంగించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్బాబు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.


