రెడ్డిగూడెం: రోడ్డుపై గేదెలు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పిన ఘటనలో భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చిన్నపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని చండ్రుపట్ల గ్రామానికి చెందిన భార్యభర్తలు బాణావాత్ రంగమ్మ(50), శ్రీను రెడ్డిగూడెం మండలంలోని రుద్రవరం గ్రామంలో శుభాకార్యానికి బైక్ మీద వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి సమీపంలోని రహదారిపైకి గేదెలు ఒక్కసారిగా మీదకు రావడంతో శ్రీను సడన్ బ్రైక్ వేశాడు. దీంతో దంపతులిద్దరూ ఒక్కసారిగా కింద పడిపోయారు. రంగమ్మ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. భర్త శ్రీనుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్లో విస్సన్నపేట ఆసుపత్రికి తరలించారు.


