చిలకలపూడి: రైతుల నుంచి రబీ సీజన్లో సజావుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆయన చాంబర్లో గురువారం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తో కలసి 2025–26 రబీ సీజన్కు ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 54,678 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని రైతులు వారి ధాన్యాన్ని పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టుకొని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం కల్పించిన వాట్సాప్ షెడ్యూలింగ్ సదుపాయాన్ని రైతులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. పౌర సరఫరాల సంస్థ డీఎం శివరాంప్రసాద్, డీఎస్వో మోహన్బాబు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, భారత ఆహార సంస్థ డివిజనల్ మేనేజర్ సురేష్, డీసీవో చంద్రశేఖర్, ఆర్టీవో శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, తూనికలు, కొలతలశాఖ అధికారి ఈశ్వరయ్య, డిసీఎంఎస్ మేనేజర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


