తిన్నోళ్లకు తిన్నంత
తళుకుల మాటున కల్తీమాయ
● ఆహారంలో మితిమీరి రంగులు
వాడుతున్నట్లు నిర్ధారణ
● ఫుడ్ కంట్రోల్ అధికారుల
తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు
● ల్యాబ్ పరీక్షల్లోనూ ఆ ఆహారం
సురక్షితం కాదని నివేదిక
● గతంలో నిల్వ మాంసం కూడా
గుర్తించిన వైనం
● అవి తింటే క్యాన్సర్కు
దారితీయొచ్చంటున్న వైద్యులు
లబ్బీపేట(విజయవాడతూర్ఫు): తినే ఆహారం కంటికి ఇంపుగా కనిపించేందుకు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మాంసాహార వంటకాల్లో సింథటిక్ కలర్స్(రసాయనాలు)ను మితిమీరి వాడుతున్నారు. నిల్వ ఉంచిన మాంసంలో సింథటిక్ రంగులు కలిపిన ఆహారాన్ని వ్యాపా రులు విక్రయిస్తుంటే.. ప్రజలు లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ఇటీవల డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. తినేందుకు సురక్షితం కానీ ఆహారంగా లేబొరేటరీ ఇచ్చిన నివేదికల్లో వెల్లడైంది.
● ఫుడ్ కంట్రోల్ అధికారులు ఇటీవల పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భాగంగా నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు, ఫుట్స్టాల్స్ను తనిఖీ చేసి 40 శాంపిల్స్ను సేకరించారు. ఆ శాంపిల్స్ను పరీక్షల కోసం లేబొరేటరీకి పంపగా, 20 శాంపిళ్లలో కల్తీ జరిగినట్లు నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. వాటిలో 3 శాంపిల్స్ నాణ్యత లోపం ఉన్నట్లు తెలుపగా, మరో 17 శాంపిల్స్ సురక్షితమైన ఆహారం కాదని రిపోర్టుల్లో పేర్కొన్నారు. దీంతో వారందరిపై ఫుడ్ కంట్రోల్ అధికారులు కేసులు నమోదు చేశారు.
● పదిరోజుల కిందట బీఆర్టీఎస్ రోడ్డు, ఐజీఎం స్టేడియం రోడ్డుల్లోని ఫుడ్ కోర్టుల్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో బీఆర్టీఎస్ రోడ్డులో 50 కేజీలు, ఐజీఎం స్టేడియం రోడ్డులో 70 కేజీలు బిర్యానీల్లో మితిమీరిన సింథటిక్ రంగులు వాడినట్లు గుర్తించారు.
● అంతేకాదు గతంలో నిర్వహించిన తనిఖీల్లో హోటళ్లలో ఏకంగా వంద కేజీల నిల్వ మాంసా న్ని ఫుడ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.
జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు రంగు, రుచి కోసం సింథటిక్ కలర్స్ను మితిమీరి వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బయట కల్తీ ఆహారం తినే వారిలో పేగు పూతలు, సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రైటిస్, ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి(ఐడీబీ), వాంతులు, విరేచనాలు వంటివి రావచ్చంటున్నారు. దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పటికే నగరంలోని జీర్ణకోశ వ్యాధుల నిపుణులు ఎక్కడ చూసినా బిజీగా ఉంటున్నారు. వారి వద్దకు రోగులు క్యూ కడుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు ఆస్పత్రులకు తరచూ ఫుడ్ పాయిజన్ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుకు బయటి ఆహారమే కారణం అంటున్నారు. జీర్ణకోశ వ్యాధులకు ఆహారపు అలవాట్లే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో నగరంలో పెద్దపేగు వ్యాధులు కూడా పెరిగాయి. అందుకు కల్తీ ఆహారమే కారణమంటున్నారు.
తిన్నోళ్లకు తిన్నంత
తిన్నోళ్లకు తిన్నంత


