
జిల్లా స్థాయి ‘మీ కోసం’లో 126 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధింఛి జిల్లాలో ఎనిమిది గ్రామాల్లో ఈ నెల 10వ తేదీన ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అప్పటికప్పుడే దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు అందిస్తామన్నారు.
కోర్టు కేసుల్లో అప్రమత్తంగా ఉండాలి..
కోర్టు కేసులకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కోర్టులు అడిగిన సమాధానాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలన్నారు. అత్యవసర కేసులు ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టిసారించి కోర్టు ఏమి అడిగింది, దానికి ఏ విధమైన సమాధానం చెప్పాలో ప్రభుత్వ న్యాయవాదులను సంప్రదించి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు 126 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు.