
అర్జీల పరిష్కారంపై ప్రజల్లో సంతృప్తి లేదు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీల పరిష్కారంపై ప్రజల్లో సంతృప్తి లేదని ఉన్నతాధికారులకు జిల్లాపై మంచి అభిప్రాయం లేదని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం హాల్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మెప్మా పీడీ పి.సాయిబాబు, ఆర్డీవో కె.స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం అర్జీల పరిష్కారంలో మొదట్లో బాగున్నప్పటికీ రానురానూ పరిష్కార ప్రక్రియపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదన్నారు. ఇంకా కొత్త, కొత్త సమస్యలు వస్తున్నాయన్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయమని అధికారులు స్పందించకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి తనతో ఎండార్స్మెంట్లో సంతకాలు చేయించుకుని కూడా అర్జీదారులకు పంపడం లేదని సమాచారం వచ్చిందన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని ప్రతి ఉద్యోగి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 27వ తేదీ మంగళవారం 7గంటలకు మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలు నుంచి సాయిబాబా గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఇందులో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. మీకోసంలో 145 అర్జీలను అధికారులు స్వీకరించారు.
కలెక్టర్ డీకే బాలాజీ ఎండార్స్మెంట్లు కూడా అర్జీదారులకు పంపడం లేదు పీజీఆర్ఎస్లో 145 అర్జీలు స్వీకరణ