
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో థీమ్ యోగా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగా ఔన్నత్యా న్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికీ చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. సోమవారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో థీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో కృష్ణబాబుతో పాటు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ గిరీష్ పీఎస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, పెద్దఎత్తున యోగా ఔత్సాహికులు, నగర ప్రజలు పాల్గొని డాక్టర్ రత్న ప్రియదర్శిని మార్గనిర్దేశనంతో యోగాసనాలు వేశారు.
26 జిల్లాల్లో 26 రోజులు...26 థీమ్లు
ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ మే 21న ప్రారంభమైన యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులపాటు 26 ఇతివృత్తాలతో థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు వివరించారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేసేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరించి, అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రతి ఒక్క వర్గాన్ని భాగస్వాములను చేస్తున్నామన్నారు. కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం కల్పించాలనే యోగాంధ్రను నిర్వహిస్తున్నామని, గ్రామ/వార్డు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో అమరావతి యోగా అసోసియేషన్, పతంజలి యోగా, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారిలు భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో విజయ వాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ వి.రాణి, జిల్లా ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో థీమ్ యోగా

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో థీమ్ యోగా