
చట్టపరిధిలో ప్రతి సమస్యకు పరిష్కారం
కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వరకట్న వేధింపులపై కొందరు, కొడుకులు పట్టించుకోవటంలేదని ఇంకొందరు, భర్తల వివాహేతర సంబంధాలపై మరి కొందరు ఎస్పీ ఎదుట వాపోతూ కన్నీరు పెట్టుకున్నారు. వారి సమస్యలు ఆలకించిన ఎస్పీ కొన్నింటిని అక్కడికక్కడే ఫోన్ల ద్వారా పరిష్కరించగా మరికొన్ని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించారు. ఇంకొన్ని ఫిర్యాదులను చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కార చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
ప్రధానమైన అర్జీలు
● వడ్లమన్నాడు నుంచి వచ్చిన ఓ వివాహిత ఎస్పీని కలిసి తనకు వివాహం జరిగి ఏడు సంవత్సరాలు అవుతోందని, గత రెండు సంవత్సరాలుగా తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, వ్యసనాలకు బానిసైన భర్త తనను పుట్టింటికి పంపించేశాడని, తనకు న్యాయం చేయమని కోరింది.
● గిలకలదిండికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు రెండేళ్ల క్రితం తన భర్త మరణించాడని, కుమారుడు, కుమార్తెకు వారికి రావలసిన ఆస్తిని సమంగా పంచామని, ఇప్పుడు కొడుకు ఉన్న ఇంటి నుంచి తనను గెంటివేసి ఇంటిని బలవంతంగా ఆక్రమించుకున్నాడని వాపోయింది. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయమని వేడుకుంది.
● పమిడిముక్కలకు చెందిన కుమార్ అనే వ్యక్తి తన పొలం సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్లడానికి దారి లేకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ వాపోయాడు. అడుగుతుంటే భౌతిక దాడికి పాల్పడుతున్నాడని, న్యాయం చేయమని అర్థించాడు.
● పామర్రు నుంచి అమ్ములు అనే మహిళ అత్తింటి వారు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతూ హింసిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ తప్పకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు.
మీకోసంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు