ఆసిఫాబాద్: ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ విధానంతో ఇసుక రవాణా మరింత సులభతరం అవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సామాన్యులు సైతం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. భూ దస్త్రాలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు క్రమపద్ధతిలో భద్రపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, మైనింగ్ అధికారి గంగాధర్, తహసీల్దార్ రియాజ్ అలీ, డీటీ పోచన్న, సిబ్బంది పాల్గొన్నారు.
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
జనగణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మూడు రోజులుగా ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో బుధవారం మాట్లాడారు. సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతీ మండలం నుంచి ఒకరు చొప్పున ఫీల్డ్ ట్రైనర్లను ఎంపిక చేసి, మూడు రోజులపాటు శిక్షణ అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీవో వాసుదేవరెడ్డి, మాస్టర్ ట్రైనర్ హుస్సేన్ పాల్గొన్నారు.
నివాస సముదాయాలు పూర్తి చేయాలి
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయ సిబ్బంది, అధికారుల నివాస సముదాయాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి, అసంపూర్తిగా నిర్మాణాలపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఆర్డీవో దత్తారావు, ఏవో కిరణ్ పాల్గొన్నారు.


