రోడ్డు ప్రమాదంలో సాద్వి కుమారి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాద్వి కుమారి మృతి

Mar 27 2026 9:18 AM | Updated on Mar 27 2026 9:18 AM

గుడిహత్నూర్‌: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొల్హారీ గ్రామానికి చెందిన సాద్వి కుమారి అశ్విని కాగ్నే (19) మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మరాఠీ వార్‌కరీ సంప్రదాయానికి చెందిన అశ్విని కాగ్నే మహారాష్ట్రలోని ఖందార్‌ తాలుకా కల్లారీ గ్రామంలో నిర్వహిస్తున్న సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం పెదనాన్న వసంత్‌ కాగ్నే, తల్లి అయోధ్యాబాయితో కలిసి ఆటోలో బయలు దేరారు. సీతాగోంది సమీపంలోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొట్టడంతో అశ్విని, వసంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించగా అశ్విని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వసంత్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

చెరువులో నీటమునిగి ఒకరు..

లక్సెట్టిపేట: ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్‌ తెలిపారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లికి చెందిన తనుగుల రాజలింగం (46) బుధవారం ఉదయం తన గేదెలను మేపేందుకు చెరువు వైపు వెళ్లాడు. చెరువుకు అవతలివైపు ఉన్న పంటచేలను మేసేందుకు గేదెలు నీటిలో నుంచి వెళ్తుండడంతో వాటిని మరల్చే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం బయట పడింది. మృతుని కుమారుడు శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ దిలీప్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ పరిశీలించారు.

చేపల వలకు చిక్కుకుని జాలరి..

లోకేశ్వరం: చేపల వలకు చిక్కుకుని జాలరి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సాథ్గాం గ్రామానికి చెందిన జాలరి పల్లికొండ సతీష్‌ (31) గురువారం ఉదయం చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని మాల్కాపూర్‌ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో వేసిన వలను తీసే క్రమంలో దానికి చిక్కుకుని నీట మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

సౌదీలో నిర్మల్‌వాసి..

నిర్మల్‌టౌన్‌: సౌదీ అరేబియా ఓమ్లోజ్‌ మదీనా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాలు ప్ర కారం..పట్టణంలోని సోఫీనగర్‌కు చెందిన జావిద్‌ (42) ఉపాధి కోసం రెండున్నర సంవత్సరాల క్రితం సౌదీకి వె ళ్లాడు. వారం రోజుల క్రితం అక్కడ జ రిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement