చెన్నూర్: ప్రతీ డ్రైవర్కు మెరుగైన కంటి చూపు అవసరమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో గురువారం చెన్నూర్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో, లారీ, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కంటి చూపే కీలకమని అన్నారు. 150 మందికి పరీక్షలు నిర్వహించి 24 మందికి కళ్లద్దాలు అందజేసినట్లు తెలిపారు. ఐదుగురిని కంటి శస్త్రచికిత్సకు ఎంపిక చేశామని తెలిపారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు బన్సీలాల్, కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు పాల్గొన్నారు.
పోలీస్స్టేషన్ తనిఖీ
భీమారం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీసీపీ భాస్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు పరిశీలించిన తర్వాత ఫిర్యాదులపై ఎస్సై రాజేందర్ను అడిగి తెలుసుకున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్, ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు.
ఇంధనంపై గందగోళం సృష్టిస్తే చర్యలు
మంచిర్యాలక్రైం: ఇంధనం కొరత ఉందంటూ గందరగోళం సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఇంధనం కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ముందస్తుగా వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించడం, క్యాన్లలో తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేయడం చేస్తున్నారని పేర్కొన్నారు. వేసవిలో పెట్రోల్, డీజిల్ ఇళ్లలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో రెండో ప్లాట్ ఫాంపై గుర్తు తెలియని రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన బోనుగూరు లింగయ్య(40) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. లింగమూర్తికి భార్య రాజలక్ష్మి, ఇద్దరు కూతుర్లు రాగశ్రీ, ఆధ్యశ్రీ ఉన్నారు. భార్య రాజలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నామని జీఆర్పీ ఎస్సై తెలిపారు.


