ఆసిఫాబాద్: మాజీ మావోయిస్టు కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎస్పీ నితిక పంత్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సందీప్నగర్కు చెందిన మాజీ మావోయిస్టు బోయిని నగేశ్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, నగేశ్ సాగు చేసుకుంటున్న భూమికి లావుణి పట్టా మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఆయన భార్యకు మహిళా సంఘాల గ్రూపులో సభ్యత్వం కల్పించి, బ్యాంకు రుణం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పదో తరగతి వరకు చదివి మానేసిన కుమార్తె ఉన్నత చదువులకు చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, కలెక్టరేట్ ఏవో జితేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
లింగాపూర్: వాగులు, ఒర్రెల వద్ద వర్షాకాలంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల్లో బుధవారం విస్తృతంగా పర్యటించి లోలెవల్ వంతెనల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా లింగాపూర్ మండలం కంచన్పల్లి పంచాయతీ మూలగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుంనూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు, సౌకర్యాలను పరిశీలించారు. అలిగూడ, గుంనూర్ నుంచి కంచన్పల్లి గ్రామానికి వెళ్లేదారి మధ్యలో లోలెవల్ వంతెన వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిర్పూర్(యు) మండలం మహాగాంపటేల్ గూడలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలన్నారు. కోయినూర్ వంతెనను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, కేజీబీవీని సందర్శించారు. జైనూర్ మండలం గౌరి గ్రామానికి వెళ్లేదారి మధ్యలోని లోలెవల్ వంతెనను పరిశీలించారు.


