కాగజ్నగర్లో హంగ్..!
ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వని పుర ఓటర్లు.. కీలకంగా మారిన స్వతంత్రులు, బీజేపీ కౌన్సిలర్లు
చింతలమానెపల్లి/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మున్సిపాలిటీ కొత్తబాట పట్టింది. ప్రతీ సారి కచ్చితమైన మెజార్టీ ఇచ్చే పుర ఓటర్లు ఈ ఎన్నికల్లో భిన్నమైన తీర్పునిచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడనుంది. పట్టణంలో 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి. చైర్మన్ పీఠం కై వసం చేసుకోవాలంటే సంఖ్యాపరంగా 16 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 9, బీజేపీ 5, ఎంఐఎం1, స్వతంత్రులు నలుగురు గెలుపొందిన నేపథ్యంలో అయోమయ పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్కు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు ఉన్నాయి. స మీకరణాలు కుదరని నేపథ్యంలో మరోమారు నంబర్ గేమ్ ఉత్కంఠ కలిగిస్తోంది.
మద్దతు ఎటువైపో..?
కాగజ్నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కై వసం చేసుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు తప్పనిసరి కానుంది. బీఆర్ఎస్కు ఐదుగురు మద్దతు అవసరం కాగా, కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల మద్దతు తెలపాలి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీ దండె విఠల్ ఓటు మినహాయిస్తే ఆరుగురి మద్దతు సరిపోతుంది. ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురితోపాటు బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కీలకం కానున్నారు. స్వతంత్రులుగా ఉన్న నలుగురిలో ఒకరు ఇప్పటికే బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతుండగా.. ఎంఐఎం తరఫున గెలిచిన కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కౌన్సిలర్లను ఇతర పార్టీల చేతికి చిక్కకుండా రహస్య శిబిరాలకు తరలించాయి.
ప్రయత్నాలు ముమ్మరం
కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో పార్టీల నాయకులు స్వతంత్రులుగా గెలుపొందిన కౌన్సిలర్లతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో నాయకులు ఇదే ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ ఖాతాలోని ఐదుగురు కౌన్సిలర్లు ఎటువైపు మద్దతు తెలిపితే వారే పీఠాన్ని కై వసం చేసుకునే అవకాశం ఉంది.
సవాల్గా మారిన చైర్పర్సన్ ఎన్నిక
కాగజ్నగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ బీసీ మహిళకు కేటాయించగా, ఎన్నిక ఆయా పా ర్టీలకు సవాల్గా మారింది. నియోజకవర్గంలో గత పంచాయతీ ఎన్నికల్లో అధిక సీట్లు దక్కించుకున్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. కోనప్ప వర్గం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి అధిష్టానం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం చేయగా 11 వార్డు స్థానాలను గెలుచుకుంది. మరోవైపు అధికార పక్షం కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండె విఠ ల్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఈ ఎన్నికలు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీకి చైర్పర్సన్ పీఠం దక్కే అవకాశం లేకపోగా, కీలకంగా ఉన్న ఐదుగురు వార్డు కౌన్సిలర్లు ఆ పార్టీకి అవకాశంగా మారారు. ఏ మాత్రం అవకాశమున్నా పట్టు నిలుపుకొని పదవి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.


