
మెడికల్ బోర్డు.. అన్ఫిట్..!
శ్రీరాంపూర్: సింగరేణిలో మెడికల్ బోర్డు నిలిచి పోయి ఏడు నెలలు గడుస్తోంది. దీంతో వ్యాధుల బారిన పడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనారోగ్యం కారణంగా డ్యూటీలు చేయలేకపోతున్న కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారిని ప్రతీ నెల బోర్డుకు పిలిచి స్క్రీనింగ్ చేస్తారు. వారి డిజిగ్నేషన్, జబ్బు తీవ్రతను బట్టి అన్ఫిట్(ఇన్వాలిడేషన్) చేయడమో, అండర్గ్రౌండ్ నుంచి సర్ఫేస్కు లేదా హయ్యర్ సెంటర్ రెఫరల్ అని ఇస్తారు. కంపెనీలో ఇంతటి ప్రా ముఖ్యత ఉన్న మెడికల్ బోర్డును చివరిసారిగా ఈ ఏడాది మార్చి 21న నిర్వహించారు. అప్పటి నుంచి రెగ్యులర్ బోర్డు నిర్వహించలేదు. కానీ హయ్యర్ సెంటర్ రెఫరల్ కేసులకు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో మెడికల్ బోర్డు నిర్వహించారు. వారు కూడా అప్పటికే నెలల తరబడి నిరీక్షించారు. మొత్తంగా 55మందిని బోర్డుకు పిలువగా వారిలో 54మంది హాజరయ్యారు. వీరిలో ఐదుగురిని మాత్రమే అన్ఫిట్ చేసి మిగతా వారిని డ్యూటీలు చేసుకోవాలని సూచించారు. కారుణ్య నియామకాలు అమలైన తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో అన్ఫిట్ కావడం ఇదే మొదటిసారి. మున్ముందు నిర్వహించే రెగ్యులర్ మెడికల్ బోర్డుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.
కార్మికుల నిరీక్షణ
రెండేళ్ల సర్వీసు మిగిలిన కార్మికులు ఎక్కువ శాతం మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. వీరితోపాటు గనుల్లో, బయట జరిగిన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారు కూడా బోర్డుకు దరఖాస్తులు అందజేస్తుంటారు. వీరందరిని ప్రతీ నెల చివరిలో బోర్డుకు పిలిచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏడు నె లలుగా బోర్డు నిలిచిపోవడంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జబ్బు కారణంగా కొందరు డ్యూటీలు కూడా సక్రమంగా చేయడం లేదు. బోర్డు నిర్వహించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా జా ప్యం చేయడం వల్ల వేతన నష్టం చవిచూడాల్సి వ స్తోందని వాపోతున్నారు. ఇప్పటికే పైరవీ ఆరోపణలతో అబాసుపాలవుతున్న మెడికల్ బోర్డు నేడు జాప్యం వల్ల మరిన్ని విమర్శలు ఎదుర్కోంటోంది. మెడికల్ బోర్డు జాప్యంతో కారుణ్య నియామకాలు పొందే డిపెండెంట్ల సర్వీసు లాస్ అవుతోందని కా ర్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రక్షాళన అయ్యేనా..?
మెడికల్ బోర్డుపై వస్తున్న అవినీతి, ఆరోపణల నేపథ్యంలో బోర్డును ప్రక్షాళన చేయడానికి జాప్యం జ రుగుతుందా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోపక్క కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరగడం, దానికి సరిపడా కొత్తగనులు లేకపోవడంతో ము న్ముందు కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తే ఎక్కడ వీరిని సర్దుబాటు చేస్తామనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బోర్డును మరింత కఠినతరం చేసి కారుణ్య నియామకాల సంఖ్య తగ్గిస్తారా..? అలా చేయడానికేనా ఇటీవల నిర్వహించిన హయ్యర్ సెంటర్ రెఫరల్ బోర్డులో ఎన్నడూ లేనంతగా కొద్దిమందిని మాత్రమే అన్ఫిట్ చేసి ఉంటారని భావిస్తున్నా రు. ఏదేమైనా ఏళ్ల తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న కారుణ్య ఉద్యోగాలు ప్రమాదంలో పడితే గెలిచిన సంఘాలతోపాటు ప్రభుత్వం కూడా భవిష్యత్లో అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వెంటనే ఏర్పాటు చేయాలి
వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. కంపెనీ, ప్రభుత్వ తీరు చూస్తే కారుణ్య ఉద్యోగా లను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రతీ నెల నిర్వహించాల్సిన మెడికల్ బోర్డును ఏడు నెలలుగా నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గెలిచిన సంఘాలు దీనిపై నోరుమెదపకపోవడం శోచనీయం.
– కేతిరెడ్డి సురేందర్రెడ్డి,
టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి