మండలాల వారీగా అర్హుల వివరాలు | - | Sakshi
Sakshi News home page

మండలాల వారీగా అర్హుల వివరాలు

Jun 30 2025 4:17 AM | Updated on Jun 30 2025 4:17 AM

మండలా

మండలాల వారీగా అర్హుల వివరాలు

రెబ్బెన మండలం గోలేటికి చెందిన మహదేవుని విజయకు ఎలాంటి భూమి లేదు. ఏటా ఉపాధిహామీ పనులకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి జిల్లా అధికారులు అర్హురాలిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ పంటల సాగు ప్రారంభం కావడంతో కూలీ పనులకు వెళ్తుంది. ఆత్మీయ భరోసా జాబితాలో పేరున్నా.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో నిరాశ చెందుతోంది. ఇలా జిల్లాలో వేలాది మంది అర్హులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

తిర్యాణి(ఆసిఫాబాద్‌): వానాకాలం పంటల సాగుకు సంబంధించి భూమి కలిగిన ప్రతీ రైతుకు రాష్ట్ర రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.6 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసింది. జిల్లాలో ఈ పథకం కింద 1.21 లక్షల మందికి పైగా లబ్ధి పొందారు. దీంతో అన్నదాతలు పంటల సాగులో బిజీగా మారారు. మరోవైపు భూమి లేని పేదలకు ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అర్హుల జాబితా రూపొందించినా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

జిల్లాలో ఇలా..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం రేషన్‌కార్డును యూనిట్‌గా సెంటు భూమి లేని నిరుపేదలను అర్హులుగా గుర్తించారు. అలాగే 2023– 24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద కనీసం 20 పనిదినాలు పూర్తి చేసి ఉండాలి. అయితే కుటుంబంలోని యజమానిగా ఎవరు ఉన్నా సదరు కుటుంబంలోని మహిళను లబ్ధిదారుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ లెక్కన జిల్లాలో 19,082 మంది అర్హులకు సాయం అందించాలని అధికారులు జాబితా రూపొందించారు. మొదటి విడత నగదు సాయం రూ.6 వేల నగదున ఈ ఏడాది జనవరి 26 తేదీనే జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ పథకాల అమలు కోసం మండలానికి ఓ గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. జిల్లాలో 15 గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మాత్రమే నగదు జమ చేశారు. మిగిలిన అర్హులకు మార్చి 31 వరకు జమ చేస్తామని పలుమార్లు ప్రజాప్రతినిధులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. రెండో విడత సాయం అందించాల్సిన సమయం వచ్చినా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. అయితే ఇటీవలే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

భూమిలేని కూలీలను ఆదుకోవాలి

ఏజెన్సీలో నివసిస్తున్నాం. మా కుటుంబం పేరుపై ఎకరం పట్టా భూమి కూడా లేదు. భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నగదు అందింది. మమ్మల్ని ప్రభుత్వం కనీసం ఆత్మీయ భరోసా కింద ఆదుకుంటుందని ఆశపడ్డాం. ఇప్పటికీ సాయం అందించకపోవడం సరికాదు. భూమి లేని కూలీలను ఆదుకోవాలి. – కాంబ్లే యోగిత, లింగాపూర్‌

జిల్లాలో 19,082 మంది అర్హుల గుర్తింపు ప్రభుత్వ సాయం కోసం తప్పని ఎదురుచూపులు రైతు భరోసా నిధుల విడుదలతో చిగురిస్తున్న ఆశలు

ఏటా రూ.12వేలు..

రాష్ట్రంలోని భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏటా రూ.12 వేలు సాయం అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా హామీ నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఆత్మీయ భరోసా పథకం కోసం ఇప్పటికే అర్హుల గుర్తింపును అధికారులు పూర్తి చేశారు. ఏడాదికి రెండు విడతలగా రూ.12 వేల ఆర్థికసాయాన్ని మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో కింద అందిచాల్సిన రూ.6 వేలు నేటికీ విడుదల చేయలేదు. భూమి ఉన్న వారికి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి.. భూమి లేని పేదలను పట్టించుకోకపోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలం అర్హుల సంఖ్య

ఆసిఫాబాద్‌ 2,245

బెజ్జూర్‌ 1,347

చింతలమానెపల్లి 647

దహెగాం 1072

జైనూర్‌ 1398

కాగజ్‌నగర్‌ 1482

కెరమెరి 2714

కౌటాల 1916

లింగాపూర్‌ 695

పెంచికల్‌పేట్‌ 358

రెబ్బెన 976

సిర్పూర్‌(టి) 1023

సిర్పూర్‌(యూ) 286

తిర్యాణి 1353

వాంకిడి 1570

మండలాల వారీగా అర్హుల వివరాలు1
1/2

మండలాల వారీగా అర్హుల వివరాలు

మండలాల వారీగా అర్హుల వివరాలు2
2/2

మండలాల వారీగా అర్హుల వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement