
సింగరేణి లాభాల వాటా ప్రకటించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణికి గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభాలను వెంటనే ప్రకటించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో గురువారం టీబీజీకేఎస్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి లాభాలు ఎన్ని కోట్లు వచ్చాయో వెంటనే ప్రకటించి, లాభాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. గతేడాది సుమారు రూ.2300 కోట్లు సింగరేణి అభివృద్ధి కోసం అని పక్కన పెట్టారని గుర్తు చేశారు. యాజమాన్యం విజిలెన్స్ పేరిట కార్మికులను వేధించడాన్ని మానుకోవాలని అన్నారు. బదిలీలను నియంత్రిస్తూ సర్క్యులర్ జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలన్నారు. జూలై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు, ఫిట్ కార్యదర్శి వెంకటేశ్, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు మంగీలాల్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్, అలవేణి సంపత్, సెంట్రల్ కమిటీ నాయకులు చంద్రశేఖర్, వెంకన్న, సీహెచ్పీ ఫిట్ కార్యదర్శి రమేశ్, నాయకులు తిరుపతి, రవి, అజీమ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.