
● సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ● గ్ర
కౌటాల మండలంలోని శీర్షా గ్రామం
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గ్రామాల్లో హడావుడి మొదలైంది. రానున్న 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి, 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించడంతో ఎన్నికల నిర్వహణ తప్పనిసరి కానుంది. గ్రామ పంచాయతీల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగియగా కొంతమంది మాజీ సర్పంచులు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆశావహులు సైతం పోటీకి సై అంటున్నారు. అయితే పట్టున్న ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనన్న ఆందోళన కనిపిస్తోంది.
335 గ్రామ పంచాయతీలు..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డులు ఉండగా, 127 ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ 15 స్థానాలు, జెడ్పీటీసీ 15 స్థానాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 34,8368 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 17,4297 పురుషులు, 17,4055 సీ్త్రలు, 16 మంది ఇతరులు ఉన్నారు. ఆరేళ్లక్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి ఒకటిన ము గిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు నిధుల కొరతతో పాటు పాలకవర్గం లేకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. నెలల తరబడి ఇన్చార్జీల పాలనే కొనసాగుతోంది. అలాగే ఎంపీటీసీ స్థానాలకు 2019లో ఎన్నికలు నిర్వహించగా, పదవీ కాలం పూర్తయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుతో గ్రామాల్లో చర్చ మొదలైంది. తొలుత పంచాయతీ ఎన్నికలు, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసే అభ్యర్థుల్లో రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొంది.
అధికారుల సన్నద్ధత
జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పల్లె ఓటరు జాబితా సిద్ధం చేశారు. ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా పోలింగ్ నిర్వహించేలా సన్నద్ధతతో ఉన్నారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్లకు మరమ్మతులు చేపట్టారు. అవసరమైన సిబ్బంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్రూంలో భద్రపరిచారు. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ అందించారు. ఓటర్ జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఇతర పనులన్నీ పూర్తిచేశామని జిల్లా పంచాయతీ అధికారులు వెల్లడించారు.
జిల్లాలో పంచాయతీలు, ఓటర్ల వివరాలు
మండలం జీపీలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
ఆసిఫాబాద్ 27 14,762 14,779 0 29,741
బెజ్జూర్ 22 11,608 11,878 2 23,488
చింతలమానెపల్లి 19 12,016 11,684 0 23,700
దహెగాం 24 10,858 10,892 0 21,750
జైనూర్ 26 11,779 12,235 0 24,014
కాగజ్నగర్ 28 22,387 21,720 2 44,109
కెరమెరి 31 11,984 11,665 1 23,650
కౌటాల 20 13,597 13,298 1 26,896
లింగాపూర్ 14 5,018 5,359 0 10,377
పెంచికల్పేట్ 12 6,231 6,044 0 12,275
రెబ్బెన 24 14,381 13,950 0 28,331
సిర్పూర్– టి 16 10,892 10,964 1 21,857
సిర్పూర్– యు 15 5,748 6,326 2 12,076
తిర్యాణి 29 8,738 9,122 4 17,864
వాంకిడి 28 14,298 13,939 3 28,240
నెలరోజుల్లో రిజర్వేషన్లు ఖరారు!
హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల్లో సర్పంచులు, వార్డు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు అలాగే ఉంటాయా, మార్పు ఉంటుందా.. అనే చర్చ జరుగుతోంది. ఈమేరకు అనుకూలంగా ఉన్న స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో రిజర్వేషన్లు అనుకూలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన నెలకొంది. పంచాయతీ పోరు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో విజయానికి పార్టీల మద్దతు కీలకం కానుంది. రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.