
క్రీడల అభివృద్ధికి పెద్దపీట
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణిలో క్రీడల అభివృద్ధికి యాజమాన్యం పెద్దపీట వేస్తోందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో శనివారం రాత్రి డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ 91వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏటా డబ్ల్యూపీఎస్ అండ్ జేఏ ఆధ్వర్యంలో వార్షిక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సింగరేణి క్రీడాకారులు కోలిండియా పోటీల్లో సత్తా చాటుతున్నారని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మిగిలినవారు క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాజమల్లు, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు నరేందర్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి తదితరులు పాల్గొన్నారు.