
పుట్టగొడుగుల్లా వెంచర్లు!
● జిల్లాలో ప్లాట్లుగా మారుతున్న వ్యవసాయ భూములు ● నాలా ధ్రువీకరణ లేకుండానే రిజిస్ట్రేషన్లు ● నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం ● మోసపోతున్న అమాయక ప్రజలు
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలోని వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. నాలాకు మార్చుకోకుండానే ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. డీటీసీపీ నుంచి అనుమతులు లేకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం వ్యవసాయ భూములను లేఅవుట్లు వేసి అమ్ముతున్నారు. సాధారణంగా వ్యవసాయేతర భూములకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలి. నాలా ధ్రువపత్రం లేకుంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయడం కుదరదు. కానీ కొందరు ఈ భూములకు రెవెన్యూ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయిస్తుండగా.. మరికొందరు డీటీసీపీ అనుమతుల కోసం దరఖాస్తు చేసి నాలా ధ్రువపత్రంపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. సాకేంతికంగా ఇబ్బందులు తలెత్తకుండా గంటల్లో వీటికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత..
కొత్తగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటైన తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లా కేంద్రం, కాగజ్నగర్ పట్టణ కేంద్రం సమీపంలో వ్యవసాయ భూములు వెంచర్లుగా మారాయి. మంచిర్యాల– నాగ్పూర్ జాతీయ రహదారిపై ఉన్న రెబ్బెన, కాగజ్నగర్ ఎక్స్రోడ్, ఆసిఫాబాద్, వాంకిడి.. కాగజ్నగర్ పట్టణ పరిసరాల్లోని పలుచోట్ల వ్యవసాయ భూములు వెంచర్లుగా మారాయి. చాలాచోట్ల వీటిని వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడం లేదు. గుంటల విస్తీర్ణంతో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీ, మున్సిపాలిటీల అనుమతులు తీసుకున్న వెంచర్లు 39 ఉండగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ వెంచర్లు ఉన్నట్లు అనాధికారిక సమాచారం. ఇందులో ఆసిఫాబాద్ పంచాయతీగా ఉన్నప్పుడు 19 వెంచర్లకు అనుమతులు మంజూరు కాగా.. మున్సిపాలిటీగా మారక నాలుగు వెంచర్లు టీఎస్–బీపాస్లో దరఖాస్తు చేసుకున్నాయి. మరో రెండు దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. కాగజ్నగర్ మున్సిపాలిటీలో 3 దరఖాస్తులు టీఎస్–బీపాస్లో దరఖాస్తు చేసుకున్నారు. మూడు వెంచర్లకు పంచాయతీ నుంచి అనుమతులు మంజూరు చేశారు. అలాగే రెబ్బెనలో 8, వాంకిడి, సిర్పూర్(టి), తిర్యాణిలో ఒక్కో వెంచరుకు అనుమతులు ఉన్నాయి.
18 రకాల సదుపాయాలు ఉండాలి...
నిబంధనల ప్రకారం లేఅవుట్ ఒక వెంచర్ను అభివృద్ధి చేయడానికి మొదటగా డీటీసీపీ ఆమోదం కోసం టీజీ–బీపాస్కు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాస్థాయి లేఅవుట్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించి సంబంధిత ధ్రువపత్రాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తే తాత్కాలిక ఆమోదం(టెంటేటీవ్ అప్రూవల్) జారీ చేస్తుంది. రెండేళ్లలో లేఅవుట్ యజమాని నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలి. విద్యుత్ సదుపాయం, తాగునీటి వసతి కల్పించాలి. పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలి. ఇలా 18 రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అధికారులు మళ్లీ లేవుట్ను పరిశీలించి తుది ఆమోదానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. లేకపోతే రిమార్కులు రాసి వాటిని పూర్తి చేయాలని ఆదేశిస్తారు. ఇలా మొత్తం ప్రక్రియ పూర్తయిన వెంచర్లలో భవన నిర్మాణ అనుమతులను అధికారులు జారీ చేస్తారు.
నిబంధనలు ఇలా...
వ్యవసాయ భూములకు గుంట నుంచి 10 గుంటల మధ్య స్లాటు బుక్ చేసి రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ కార్యాలయాలకు వస్తే దీనిపై విచారణ జరిపించాలి. తండ్రి లేదా తల్లికి ఎకరం స్థలం ఉండి వారికి ఎక్కువ మంది సంతానం ఉంటే(కుటుంబ సభ్యులకు) మాత్రం రిజిస్ట్రేషన్లు చేయవచ్చు. సంబంధం లేని వ్యక్తులు నిత్యం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు స్లాటు బుక్ చేస్తే తహసీల్దారుకు అనుమానం రావాలి. ఈ సర్వే నంబరులో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా లేదా అని విచారించాలి. అయితే చాలాచోట్ల ఇవేమీ చేయడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారమని తెలిసీకూడా వ్యవసాయ భూములకు గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
డీటీసీపీ పేరిట విక్రయాలు...
ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న మాయాజాలానికి అమాయక ప్రజ లు బలవుతున్నారు. వెంచర్ అనుమతి కోసం డీటీసీపీకి దరఖాస్తు చేశామని లేనిది ఉన్నట్లుగా తప్పుడు సమాచారంతో ప్లాట్ల ను అంటగడుతున్నారు. చాలాచోట్ల కేవలం నాలా అనుమతులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు మోసపోతుండగా.. వ్యాపారులు మాత్రం లాభపడుతుండటం గమనార్హం.
అనుమతుల్లేని వాటికి నోటీసులు
జిల్లాలో చాలాచోట్ల డీటీసీపీ కోసం దరఖాస్తు చేశామంటూ కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణ పరిసరాల్లో ఇలాంటి వెంచర్లు వెలిసినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. డీటీసీపీ అనుమతి కోసం దరఖాస్తు చేసి.. నిబంధనల మేరకు వెంచర్ను అభివృద్ధి చేయకుండానే నాలా అనుమతుల పేరిట రిజిస్ట్రేషన్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి యజమానులకు నోటీసులు జారీ చేస్తాం.
– యశ్వంత్, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి