● ‘రైతు భరోసా’ నేపథ్యంలో బ్యాంకుల్లో మనీ కొరత ● రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు ● సాగు సమయంలో పెట్టుబడి ఖర్చులకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

● ‘రైతు భరోసా’ నేపథ్యంలో బ్యాంకుల్లో మనీ కొరత ● రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు ● సాగు సమయంలో పెట్టుబడి ఖర్చులకు ఇబ్బందులు

Jun 28 2025 5:57 AM | Updated on Jun 28 2025 7:39 AM

● ‘రై

● ‘రైతు భరోసా’ నేపథ్యంలో బ్యాంకుల్లో మనీ కొరత ● రోజుల త

చింతలమానెపల్లి(సిర్పూర్‌): జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌లో ఎస్‌బీఐతోపాటు ఇతర ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. అలాగే అన్ని మండల కేంద్రాలు, వాణిజ్య కేంద్రాల్లోనూ బ్యాంకుల సదుపాయం ఉంది. జిల్లా ప్రజలు ఎక్కువగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ప్రాథమిక రైతు సహకార సంఘాలకు చెందిన బ్యాంకులపై ఆధారపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఈ నెల 23 నాటికి జిల్లాలో 1,21,287 మంది అన్నదాతల ఖాతాల్లో రూ.240.60 కోట్ల నగదును జమ చేసింది. ప్రతీ మండలానికి ఆయా మండలం పరిధిలో వ్యవసాయ భూములు, రైతులను అనుసరించి రూ.5 నుంచి రూ.12 కోట్ల వరకు నగదు మంజూరైంది. పెట్టుబడి సాయం అందుకున్న రైతులు నగదు డ్రా కోసం బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. నిత్యం వందలాది మంది బ్యాంకుల వద్ద వస్తుండటంతో రద్దీ నెలకొంటోంది.

నగదు పరిమితి..

బ్యాంకు నిబంధనలను అనుసరించి ఖాతాదారుల కు అందించే నగదు విషయంలో పరిమితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ బ్యాంకులకు రెండురోజులకు ఒకసారి రూ.60 నుంచి రూ. 70లక్షల నగదు తీసుకొస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ.30లక్షల వరకు మాత్రమే రైతులు, ఖాతాదారులకు పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదుకు డిమాండ్‌ ఎక్కువగా ఉండగా సరిపడా అందడం లేదు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో రైతులతోపాటు వ్యాపారులకు సైతం అవసరాలు ఉండటంతో అక్కడ డిమాండ్‌ మరింత ఉంది. పట్టణ ప్రాంతాల్లో బ్యాంకులు అధికంగా ఉన్న నగదు సరఫరా సరిపడా లేదు.

సాగు సమయంలో అవస్థలు

విత్తనాల కొనుగోలు, ఎరువులు, పురుగుమందులకు రైతులకు నగదు అవసరం అధికంగా ఉంటోంది. బ్యాంకుల వద్ద వారు వేచి ఉండాల్సి వస్తోంది. దహెగాం, చింతలమానెపల్లి, బెజ్జూర్‌, కెరమెరి, జైనూర్‌ వంటి మండలాల్లోని బ్యాంకులకు చేరుకోవడానికి ఆయా గ్రామాల రైతులు 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. చింతలమానెపల్లి మండలంలోని కోయపెల్లి నుంచి రవీంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చేరుకోవడానికి సుమారు 30కిలోమీటర్ల దూరం ఉంది. నగదు కోసం పలుమార్లు తిరగడం రైతులకు ప్రయాసగా మారింది. వ్యవసాయ పనులు చేసే సమయంలో అవస్థలు పడుతున్నారు. చింతలమానెపల్లి, బెజ్జూర్‌ మండలాల్లో కనీసం ఏటీఎంలు కూడా లేవు. పట్టణాల్లోని ఏటీఎంల్లో నగదు అందుబాటులో లేకపోవడం రైతులు, సాధారణ విద్యార్థులు, ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతోంది. డిజిటల్‌ చెల్లింపులు సదుపాయం ఉన్నా రైతులు, కూలీలకు చాలామందికి అవగాహన లేదు. ఫలితంగా చెల్లింపులు నగదు రూపంలో చేయాల్సి రావడంతో తిప్పలు తప్పడం లేదు. రైతు భరోసా పథకం డబ్బులు ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించి బ్యాంకుల్లో నిబంధనలు సడలించి సరిపడా నగదు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌ బ్యాంకులో రైతుల రద్దీ

ఈ ఫొటోలోని రైతు పేరు డోకె రాకేశ్‌. చింతలమానెపల్లి మండలం దిందా నుంచి బ్యాంకు ఖాతా నుంచి నగదు డ్రా చేసేందుకు ఇటీవల రవీంద్రనగర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెళ్లాడు. తీరా బ్యాంకులో నగదు లేదని చెప్పడంతో గ్రామానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బ్యాంకు వచ్చాడు. పంట పెట్టుబడికి రూ.లక్ష అవసరం ఉందని, బ్యాంకులో నగదు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రాకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క రాకేశ్‌ మాత్రమే కాదు.. జిల్లాలో చాలామంది రైతులు వ్యవసాయ పనులు, పంట పెట్టుబడికి సరిపడా బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

చర్యలు తీసుకోవాలి

బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలి. పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి రావడం ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం బ్యాంకు అధికారులకు సూచనలు ఇవ్వాలి. – కుకుడ్‌కార్‌ రమేశ్‌,

బాలాజీ అనుకోడ, మం.చింతలమానెపల్లి

గ్రామీణ ప్రాంతాల్లో పరిమితి

గ్రామీణ ప్రాంతాల్లో నగదు తరలించడానికి పరిమితి ఉంటుంది. సెక్యూరిటీ సమస్యలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి రవీంద్రనగర్‌ బ్యాంకుకు రెండురోజులకు ఒకసారి రూ.70లక్షల వరకు నగదు తీసుకొస్తున్నాం. వానాకాలంలో నగదు డిమాండ్‌ పెరిగింది. కొద్దిరోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నాం. రైతులకు ఇబ్బంది కాకుండా పరిమితిగా అందిస్తున్నాం.

– కిరణ్‌కుమార్‌, టీజీబీ మేనేజర్‌

● ‘రైతు భరోసా’ నేపథ్యంలో బ్యాంకుల్లో మనీ కొరత ● రోజుల త1
1/2

● ‘రైతు భరోసా’ నేపథ్యంలో బ్యాంకుల్లో మనీ కొరత ● రోజుల త

● ‘రైతు భరోసా’ నేపథ్యంలో బ్యాంకుల్లో మనీ కొరత ● రోజుల త2
2/2

● ‘రైతు భరోసా’ నేపథ్యంలో బ్యాంకుల్లో మనీ కొరత ● రోజుల త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement