
రాజ్యాంగానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్
● బీజేపీ రాష్ట్ర ప్రతినిధి ధర్మారావు
కాగజ్నగర్టౌన్: దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధిస్తూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన వేలాది మంది మేధావులు, జర్నలిస్టులు, యువకులను అరెస్టు చేసి జైల్లో వేసి అరాచకాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్లు ప్రజలు అరిగోస పడ్డారని ఆరోపించారు. సమావేశంలో బీజేీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, విజయ్, రాణి, కొప్పుల శంకర్, మనోహర్గౌడ్, మల్లికార్జున్, సుధాకర్రావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.