జిల్లా వివరాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వివరాలు

May 5 2025 8:52 AM | Updated on May 5 2025 8:52 AM

జిల్ల

జిల్లా వివరాలు

● జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆగని బాల్యవివాహాలు ● కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు ● గుట్టుచప్పుడు కాకుండా బాలికలకు పెళ్లిళ్లు

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): బాల్యవివాహాలు అరికట్టడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతు న్నా క్షేత్రస్థాయిలో మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పక్కా సమాచారంతో అడపాదడపా అధికారులు అడ్డుకుంటున్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ కౌన్సెలింగ్‌ ఇస్తున్నా తల్లిదండ్రులు, సమాజం తీరులో మార్పు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు, నిరాక్షరాస్యత, తొందరగా పెళ్లి చేస్తే బాధ్యతలు తగ్గుతాయనే ఆలోచనతో కుటుంబ పెద్దలు బాలికలకు చదువుకునే వయస్సులోనే పెళ్లి చేస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో బాలికలకు 16 ఏళ్లలోపే పెళ్లి చేసి వారి బాల్యానికి మూడు ముళ్లు వేస్తున్నారు. జిల్లాలో 2019 నుంచి నేటి వరకు జిల్లా అధికారులు 153 బాల్యవివాహా లు అడ్డుకుని కుటుంబాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇటీవల రెబ్బెన మండలం నారాయణపూర్‌ గ్రామంలో బాల్యవివాహం చేస్తున్నారనే సమాచా రంతో అక్కడికి చేరుకున్న అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. బెజ్జూర్‌ మండలం బారెగూడ గ్రా మంలో కూడా బాల్యవివాహాన్ని అడ్డుకుని బాలల సంరక్షణ అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

అవగాహన లోపంతో..

బాల్యవివాహాలు ఎక్కువగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. బాలికలకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులతోపాటు దగ్గరి సంబంధాల పేరుతో తల్లిదండ్రులు వివాహం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పదో తరగతి పూర్తయిన బాలికలకు పెళ్లి చేసి బాల్యాన్ని బందీ చేస్తున్నారు. పెళ్లిళ్లు చేసే బాలికల సగటు వయస్సు 16 సంవత్సరాలు ఉంటే వీరిని 25 ఏళ్ల యువకులు వివాహం చేసుకుంటున్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం ద్వారా మైనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక ఎదుగుదల లేకపోవడం, రక్తహీనత, అనారోగ్య శిశువులు జన్మించడం, శిశుమరణాలు, జన్యుపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. చదువుకునే వ యస్సులో కుటుంబ బరువు, బాధ్యతలతో బాలికలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.

ఇటీవల బెజ్జూర్‌లో బాల్యవివాహం అడ్డుకుని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న అధికారులు

సంవత్సరం అడ్డుకున్న బాల్యవివాహాలు

2019 38

2020 29

2021 24

2022 23

2023 18

2024 15

2025 06(నేటివరకు)

పేరుకే కమిటీలు..

బాల్యవివాహాలు నిరోధించడానికి ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. వీటిలో జిల్లాస్థాయిలో కలెక్టర్‌ బాల్యవివాహాల నిరోధక అధికారిగా వ్యవహరిస్తారు. డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలు, సీడీపీవో, మండల స్థాయిలో తహసీల్దార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, గ్రామస్థాయిలో అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు కమిటీలో ఉన్నా రు. గ్రామాల్లో పదుల సంఖ్యలో బాల్యవివాహాలు జరిగిన సమయంలో మాత్రమే అధికారుల దృష్టికి వస్తున్నాయి. వీటిని మాత్రమే అడ్డుకుంటున్నారు. అధికారుల దృష్టికి రాకుండా బాలికల బాల్యం మూడు ముళ్లలో చిక్కుకుపోతోంది. ఇప్పటికైనా బాల్యవివాహాలను అరికట్టడానికి క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కఠిన చట్టాలు ఉన్నా..

బాల్య వివాహాలు అడ్డుకోవటానికి ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 2006 చట్టం ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే వరుడితోపాటు తల్లిదండ్రులు, పెళ్లికి హాజరైన బంధువులు, వివాహం చేసిన పురోహితులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించేందుకు ఆస్కారం ఉంటుంది. మైనర్‌ బాలికను వివాహం చేసుకుని జీవనం సాగిస్తే వరుడు, అతడి తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులు, బంధువులపై పోక్సో చట్టం ప్రకారం పదేళ్ల నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

అవగాహన కల్పిస్తున్నాం

బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గుర్తించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. అయినా చాలాచోట్ల తల్లిదండ్రులు వివిధ కారణాలను చూపుతూ రహస్యంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. పక్కా సమాచారం ఉన్న వాటిని అడ్డుకుంటున్నాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలి. చట్టానికి విరుద్ధంగా బాల్య వివాహాలు జరిపిస్తే కేసులు నమోదు చేస్తాం. బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతిఒక్కరూ సహకరించాలి. – బి.మహేశ్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి

జిల్లా వివరాలు1
1/1

జిల్లా వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement